పెండింగ్ ఈ- చలాన్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు
నకిలీ ఈ-చలాన్ లింకుల ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు చోరీ అవుతున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. "చలాన్ పెండింగ్" అంటూ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలు, అధికారిక సైట్లను పోలిన లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ లింకులు క్లిక్ చేస్తే మాల్వేర్ ఇన్స్టాల్ కావచ్చు లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా చోరీకి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వీ అరవింద్ బాబు ఓ ప్రకటన ఇచ్చారు.
మోసపూరిత లింకును క్లిక్ చేసినప్పుడు, వాహన రిజిస్ట్రేషన్ నంబరును అడిగి చలాన్ మొత్తాన్ని చూపుతారు. చెల్లింపులు చేసేటప్పుడు మొబైల్లో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది లేదా బ్యాంకింగ్ వివరాలు చోరికి గురి అవుతాయి. ఫలితంగా- అనధికార లావాదేవీలు, మొబైల్ హ్యాకింగ్కు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ చలాన్లను అధికారిక ప్రభుత్వ పోర్టల్ల ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.

ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని, ప్రభుత్వ విభాగాలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింక్లను ఎప్పటికీ పంపబోవని వివరించారు. ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్సైట్లలో పొందుపర్చవద్దని, యాప్లను అధికారిక ప్లేస్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
మొబైల్ ఫోన్ను ఎప్పుడూ భద్రతా ప్యాచ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో అప్డేట్లో ఉంచాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా/వైఫై డిస్కనెక్ట్ చేసి బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. లావాదేవీలు/కార్డులను బ్లాక్ చేయాలి. 1930కు డయల్ చేయాలి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని, లేదా దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications