ప్రధాని సోదరుడి కార్యదర్శినంటూ మోసం: ఇతనే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కార్యదర్శినంటూ ఫోన్లు చేసి పనులు చేసుకొని ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన నగరానికిచెందిన వెంకటప్రసాద్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కార్యదర్శినంటూ ఫోన్లు చేసి పనులు చేసుకొని ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన నగరానికిచెందిన వెంకటప్రసాద్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటప్రసాద్ యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు.ఇతని స్నేహితుడు తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలిండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోడీ గతంలో చాంద్రాయణ్ గుట్ట ప్రాంతానికి వచ్చారు.
అప్పట్లో తన స్నేహితుడి ద్వారా ఆయన వెంకటప్రసాద్ ప్రహ్లాద్ మోడీని కలిసి మాట్లాడారు.దీన్ని క్యాష్ చేసుకొనేందుకుగాను ఆయన ఓ పథకం వేశాడు. ఓ సెల్ నెంబర్ ను తీసుకొని ట్రూ కాలర్ యూప్ లో పీఏంఓ మోడీ సెక్రటరీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు.
దీన్ని వినియోగించుకొని కొన్ని రోజులుగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నాడు. తాను ప్రహ్లాద్ మోడీ వ్యక్తిగత కార్యదర్శినంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి మాట్లాడుతున్నానంటూ అనేక మందికి అపాయింట్ మెంట్లు ఇవ్వాలని, కొన్ని ఫైల్స్ పై త్వరగా సంతకాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరికొన్ని సిఫారసులు చేయించుకొంటున్నాడు. దీనిపై ఢిల్లీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు నగర పోలీసు విభాగానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఈ వ్యవహారంపై ఆబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుదవారం నాడు నిందితుడిని అరెస్టు చేశారు.