యువతుల ఆత్మహత్య కేసులో ఆసక్తికర విషయాలు.. కరీంనగర్ నుంచి మేడ్చల్ ఎందుకు వచ్చారు?
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు సమీపంలోనే చిన్నారి మృతదేహం కూడా లభ్యమైంది. ఈ ముగ్గురు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు దర్యాప్తు జరపగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చనిపోయిన యువతులను కరీంనగర్కు చెందిన అనూష,సుమతిలుగా గుర్తించారు. ఆ చిన్నారిని అనూష కుమార్తె ఉమా మహేశ్వరిగా గుర్తించారు. లాక్ డౌన్కు కొద్దిరోజుల ముందు వీరు కరీంనగర్ నుంచి మేడ్చల్కు వచ్చినట్టు సమాచారం.

ఎవరు వీళ్లు..
ఖమ్మంకు చెందిన అనూష(26)కు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఉమా మహేశ్వరి(8) అనే పాప కూడా ఉంది. ఈ నెల 10న రేషన్ సరుకుల కోసం అనూష తన స్నేహితురాలు సుమతి(28)తో కలిసి వెళ్లింది. పాపను కూడా వెంట తీసుకెళ్లింది. సుమతి కూడా వివాహితురాలే. వెల్గటూర్కు చెందిన ఆమె శ్యాం అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని జ్యోతినగర్లో నివాసం ఉంటోంది. వీరికి కూతురు,కుమారుడు ఉన్నారు.

మనస్తాపంతో కరీంనగర్ నుంచి మేడ్చల్కు
రేషన్ సరుకుల కోసం ఉదయం ఇంటి నుంచి వెళ్లినవారు.. ఆలస్యంగా ఇంటికి రావడంతో వారి కుటుంబ సభ్యులు మందలించినట్టు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు అదేరోజు సాయంత్రం మేడ్చల్లోని జవహర్నగర్కు బయలుదేరారు. అనూష ఇటీవల కరీంనగర్లో కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఆమె 2 నెలల హైదరాబాద్లో ఉద్యోగం కూడా చేసినట్టు సమాచారం. ఆ సమయంలోనే జవహర్నగర్లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆ పరిచయంతోనే అనూష.. తన కుమార్తె,సుమతిలతో కలిసి జవహర్ నగర్కు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.

ఇక్కడే చిక్కుకుపోయారు...
హైదరాబాద్ చేరుకున్న రెండు,మూడు రోజులకే లాక్ డౌన్ ప్రకటించడంతో వీరు ఇక్కడే చిక్కుకుపోయారు. అప్పటినుంచి సమీపంలోనే చర్చిలోనే వీరు ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు మార్చి 10న వీరు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫాస్టర్ కొడుకుతో అనూష కాల్ డేటాను పరిశీలిస్తే కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి మేడ్చల్కి ఎలా వెళ్లారు.. ఎందుకు వెళ్లారన్నది తెలియాల్సి ఉంది. ఆ వివరాలు బయటకొస్తే.. ఇది హత్యా.. ఆత్మహత్యా.. అన్న చిక్కుముడి వీడవచ్చు.

కొనసాగుతున్న దర్యాప్తు..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరు ఆత్మహత్య చేసుకున్నారు. మొదట సుమతికి కుమార్తె ఉమామహేశ్వరికి కూల్డ్రింక్లో హార్పిక్, ఆలౌట్ కలిపి తాగించారు. చిన్నారి చనిపోయిందని నిర్దారించుకున్నాక.. ఇద్దరూ చున్నీలతో చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే నిజానిజాలు బయటపెడుతామని పోలీసులు ధీమాగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications