'ప్లీజ్ వదిలి వెళ్లకు, ఏదో తేడా ఉంది': శిరీష కేసులో ఆ టైంలో ఏం జరిగింది?
ఫిలింనగర్లో ఆత్మహత్య చేసుకున్న బ్యూటిషియన్ శిరీష మృతిపై కుటుంబ సభ్యులు, ఇతరులు పదేపదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
హైదరాబాద్: ఫిలింనగర్లో ఆత్మహత్య చేసుకున్న బ్యూటిషియన్ శిరీష మృతిపై కుటుంబ సభ్యులు, ఇతరులు పదేపదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆత్మహత్యకు రాజీవ్, శ్రవణ్ కారణమని చెప్పారు.
కస్టడీలో ఏం రాబట్టినట్టు?: రాజీవ్, శ్రవణ్లు కొత్తగా చెప్పిందేంటి?, 'శిరీష' ఇక మిస్టరీయేనా!
కుకునూరుపల్లికి వెళ్లినప్పుడు అక్కడ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచార ప్రయత్నం చేశాడని, మనస్తాపంతో శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి చివరి ఒకటి రెండు మూడు గంటల్లోనే ఏదో జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
భర్తకు, అదే సమయంలో రాజీవ్కు శిరీష సందేశాలు
శిరీషను కుకునూరుపల్లి పోలీసు క్వార్టర్స్కు రాజీవ్, శ్రవణ్లు కారులో ఆ రోజు రాత్రి 11.30కు తీసుకు వెళ్లారు. అక్కడ రాజీవ్, శ్రవణ్లు శిరీషను ఎస్సై వద్ద వదిలి బయటకు వెళ్లారు. వారు బయట సిగరేట్ తాగుతున్న సమయంలో శిరీష వాట్సాప్ ద్వారా భర్తకు లొకేషన్ షేర్ చేసింది. అప్పుడు అర్ధరాత్రి రెండు గంటలు కావొస్తుంది. అదే సమయంలో రాజీవ్ సెల్ ఫోన్కు ఓ ఐదు నిమిషాల పాటు రాజీవ్ సెల్ఫోన్కు మెసేజ్లు పంపింది.
నన్ను వదిలి వెళ్లకు.. ఏదో తేడా కొడుతోంది.
తనను ఎస్సై వద్ద ఒంటరిగా వదిలి వెళ్లవద్దని రాజీవ్ను కోరింది. రాజీవ్! నాకు దూరం అవకు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్లకు, నాకు ఏదో తేడా కొడుతోందని శిరీష సందేశాలు పంపించిందని తెలుస్తోంది. పదేపదే ఆమె వాట్సాప్ సందేశాలు పంపించింది. ఆ తర్వాత రాజీవ్, శ్రవణ్, ఎస్సైలు లోపలకు వచ్చి, మరోసారి సిగరేట్ తాగేందుకు ఇద్దరు బయటకు వెళ్లిన సమయంలో ఎస్సై ఆమెను బలవంతం చేసే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. అప్పుడు శిరీష దూరం జరిగి, తనను ఏమీ అనవద్దని, తాను అలాంటి దానిని కాదని ఏడ్చింది. అరిచింది. దీంతో రాజీవ్, శ్రవణ్లు లోపలకు వచ్చారు. ఎస్సైను బయటకు తీసుకు వచ్చారు. శిరీష గట్టిగా అరిచింది. అప్పుడు రాజీవ్ ఆమెను కొట్టాడని కూడా తెలుస్తోంది.
వచ్చిందేమిటి, జరుగుతున్నదేమిటి?
ఇక్కడకు వచ్చిందేమిటి, చేస్తుందేమిటని శిరీష ఏడ్చింది. దీంతో ఆమెను తీసుకు వెళ్లాలని ఎస్సై వారికి వెంటనే సూచించాడు. దీంతో వారు అర్ధరాత్రి రెండున్నర గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న శిరీష కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆమెను రాజీవ్ కొట్టాడు. సీటుకు తలను కొట్టాడు, తిట్టాడు. శ్రవణ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. కొద్ది దూరం వచ్చాక ఎస్సై వెళ్లిపోయారు కదా అని ఫోన్ చేశాడు. ఆ తర్వాత మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టూడియోకు చేరుకున్నారు.
బెడ్రూంలోకి వెళ్లి చూసేసరికి..
శిరీష కారు దిగి, ఏడుస్తూ స్టూడియోలోకి వెళ్లింది. బయోమెట్రిక్లో వేలిముద్ర వేసి 3.47కి లోనికి వెళ్లింది. తర్వాత శిరీష 3.54కి రాజీవ్కు వీడియో కాల్ చేసింది. అతను ఫోన్ ఎత్తలేదు. 3.55కి రాజీవ్ కూడా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా లోనికి వెళ్లి కేవలం 3.58కి బయటకు వచ్చాడు. శ్రవణ్ కోసం క్యాబ్ను 3.59కి బుక్ చేశాడు. తర్వాత 4.03కి రాజీవ్ వీడియో కాల్ను శిరీషకు చేశాడు. ఆమె ఫోన్ ఎత్తలేదు. తర్వాత రాజీవ్ మళ్లీ కింద నుంచి పైన తన గదికి 4.07కి వెళ్లాడు. శిరీష ఫోన్ తీయకపోవడం, గదిలోనికి వెళ్లి తలుపు వేసుకోవడం, పిలిచినా పలకకపోవడంతో ఆందోళన చెందిన రాజీవ్ బెడ్రూం తలుపులను గట్టిగా బలవంతంగా నెట్టి లోనికి వెళ్లాడు. శిరీష ఫ్యానుకు ఉరేసుకొని ఉంది. వెంటనే కిచెన్ నుంచి కత్తి తీసుకుని వచ్చి ఆమె చున్నీ కత్తిరించి కిందకు దింపాడు.
తమ కథను పక్కన పెట్టి.. ఫ్యామిలీ సమస్యలంటూ..
వెంటనే శ్రవణ్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శ్రవణ్ కూడా తిరిగి వచ్చాడు. ఆంబులెన్స్ సిబ్బంది వచ్చి శిరీషను చూసి ఆమె చనిపోయిందని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన ఇద్దరు ఎస్సై క్వార్టర్లో జరిగిన విషయం గురించి పోలీసులకు చెప్పవద్దని నిర్ణయించుకుని కుటుంబ సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు కొత్తకథ చెప్పారు.
చనిపోయిన తర్వాతే.. బయోమెట్రిక్ గేమ్ ఆడారా?
అయితే, ఈ సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఎస్సై క్వార్టర్సులో కొట్టడం, తిట్టడం జరిగిందని, అంటే అక్కడి నుంచి అసలు ఆమె సజీవంగా వచ్చారా, లేక అక్కడే చనిపోయిందా తేలాలని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులో ఆమె పెనుగులాడిందని, దూకే ప్రయత్నం చేసిందని చెబుతున్నప్పుడు.. 70 కిలోమీటర్ల దూరాన్ని గంటంపావులో ఎలా వచ్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ సెన్సర్లు మరణించిన వ్యక్తి వేలిని సెన్సార్ మీద పెట్టినా అది పని చేస్తోందని, మరి నిర్జీవంగా ఉన్న శిరీషను అదే విధంగా లోనికి తీసుకుని వెళ్లి ఆత్మహత్య డ్రామా ఎందుకు ఆడి ఉండకూడదనేది మరో అనుమానమని అంటున్నారు. ఇక, 80 కిలోల బరువు ఉన్న శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఫ్యాన్ వంగలేదని, చున్నీ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు తొలి నుంచి ఉన్నవే.
చనిపోయిన వ్యక్తినే..
శిరీష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు చెబుతున్నప్పటికీ.. నిర్జీవంగా ఉన్న శిరీషనే ఉరి వేసినట్లు డ్రామా ఆడి ఉండవచ్చు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శిరీష పంపిన వాట్సాప్ లొకేషన్ రిసార్టు చూపించిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీస్ క్వార్టర్సులోనే ఉందని పోలీసులు చెప్పారు. దీనిపై స్పష్టత లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. మొత్తంగా శిరీష మృతిలో అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యనే ఏదో జరిగిందని అంటున్నారు.