అశ్లీల ఫోటోలతో బ్లాక్ మెయిల్: టెక్కీ అరెస్టు
యువతికి అశ్లీల ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె పెళ్లిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: యువతికి అశ్లీల ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె పెళ్లిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న బోరంటి రాజు అలియాస్ రాజు ను అరెస్టు చేశామని గురువారం బెంగళూరు పోలీసులు చెప్పారు.
బెంగళూరులోని హెచ్ఏఎల్ ప్రాంతం లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతితో రాజు కాలేజ్ లో కలిసి చదువుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఆమె రాజును ఓ స్నేహితుడిగా బావించింది. రాజు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.
ఓ సందర్బంలో రాజును పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది. అంతే రాజుకు పట్టలేని కోపం వచ్చింది. ఆ యువతికి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను ఆమె ఫోటోలు డౌన్ లోడ్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఆమె కంప్యూటర్లలో కొన్ని రహస్యంగా ఉన్న ఫోటోలు డౌన్ లోడ్ చేసుకున్నాడు.
తరువాత ఆఫోటోలను పొర్న్ స్టార్ ఫోటోలు కలిసి మార్ఫింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఆయువతికి పంపించాడు. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు మీ కుటుంబ సభ్యులకు పంపించి తరువాత యూట్యూబ్ లో పెడుతానని బెదిరించాడు.
అప్పటికీ ఆ ఫోటోలు పంపిస్తున్నది రాజు అని ఆమె గుర్తించలేకపోయింది. ఇటీవల వేరే వ్యక్తితో ఆ యువతి పెళ్లి నిశ్చయం అయ్యింది. విషయం తెలుసుకున్న రాజు ఇంకా రెచ్చి పోయాడు. అతను వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె వెంటనే హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏడు సిమ్ కార్డులు ఉపయోగించి రాజు ఆ యువతికి ఫోన్లు చెయ్యడం, అశ్లీల ఫోటోలు పంపించడం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు అతను ఆమెను బెదిరిస్తూ ఫోటోలు పంపిస్తున్న ఫోన్ నెంబర్ ఏ ఏరియాలో ఉందో అని ట్రేస్ చేశారు.
చివరికి రాజు హైదరాబాద్ లో తలదాచుకున్నాడని బెంగళూరు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో రాజుని కూకట్ పల్లి ఏరియాలో అరెస్టు చేసి బెంగళూరు తీసుకువచ్చామని గురువారం హెచ్ఏఎల్ పోలీసులు తెలిపారు.