నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ కొరత కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా ఇప్పటికే పలు ప్రధాన నగరాలు అయిన బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్ కతా, లక్నోలోని హోటళ్లు, రెస్టారెంట్స్, హాస్టళ్లు మూత పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఇక బెంగళూరులోని పీజీలు, హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే బెంగళూరులోని పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
మెనూలో పలు మార్పులు చేసింది. ఇక నుంచి వీక్ డేస్ లో రోజుకు రెండు మీల్స్ మాత్రమే అందిస్తామని పేర్కొంది. అలాగే వీకెండ్స్ లో మాత్రం మూడు మీల్స్ అందిస్తామని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో కేవలం శని, ఆదివారాలు మాత్రమే టిఫిన్ ఉంటుంది. మిగతా రోజుల్లో కేవలం రెండు మీల్స్ మాత్రమే ఉండనున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని హాస్టల్స్ కూడా అదే బాట పట్టాయి. హైదరాబాద్ లోని మాధాపూర్, గచ్చిబౌలి, అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లోని హాస్టల్స్ లో ఇప్పుడు కొత్త కొత్త నోటీసులు ప్రత్యక్షం అయ్యాయి.

ఆ నోటీసు ప్రకారం గ్యాస్ కొరత కారణంగా మార్చి 10 నుంచి హైదరాబాద్ లోని హాస్టల్స్ లో మెనూలో తాత్కాలికంగా మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే టిఫిన్స్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అందులో దోశ, పూరీ, ఇడ్లీ, వడ, బోండ, చపాతీ, డీప్ ప్రై పదార్థాలు ఉన్నాయి. ఈ టిఫిన్స్ ను హాస్టల్స్ లో నిలిపివేస్తున్నట్లు నోటీసులు పెడుతున్నాయి. ఈ మేరకు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేసింది. దేశ ప్రజల అవసరాల దృష్ట్యా LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు పేర్కొంది.













Click it and Unblock the Notifications