ఎన్టీఆర్ను గద్దెదించినప్పుడు ఏడ్చాను, కానీ, మావోయిస్టులు అవమానిస్తారని భయపడ్డా: మండవ
Recommended Video
హైదరాబాద్: 1989లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సమయంలో తన నియోజకవర్గంలో ఏదైనా పొరపాటు చేశామని ప్రజల ముందు అవమానిస్తారేమోనని భయపడ్డానని మాజీ మంత్రి టిడిపి నేత మండవ వెంకటేశ్వరావు చెప్పారు మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సమయంలో తనను చంపేస్తారని తాను భయపడలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.ఎన్టీఆర్ను గద్దె దించేందుకు రాజ్ భవన్ను వెళ్ళిన సమయంలో తాను తీవ్రంగా బాధపడినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు ఎన్టీఆర్ స్థానంలో తన తండ్రి ఉన్నా కూడ ఆయనను గద్దె దింపేందుకు ముందు నడిచేవాడినని ఆయన చెప్పారు.
ఓ తెలుగు న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండవ వెంకటేశ్వర్ రావు తన రాజకీయ జీవిత ప్రస్తానం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని తన తండ్రి చేసిన సూచనను పాటిస్తున్నానని ఆయన చెప్పారు.
మారిన పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకొంటున్నట్టు మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు. ప్రతి సారీ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా కొన్ని సమయాల్లో పార్టీ నాయకత్వం సూచన మేరకు పోటీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని మండవ వెంకటేశ్వర్ రావు గుర్తు చేసుకొన్నారు.
ఎన్టీఆర్ను గద్దెదించేందుకు రాజ్భవన్కు వెళ్ళిన సమయంలో ఏడ్చా
ఎన్టీఆర్ను గద్దె దింపే సమయంలో రాజ్భవన్కు వెళ్ళిన సమయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాయని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు. ఎన్టీఆర్ ను గద్దె దింపకపోతే పార్టీని కాపాడుకొనే పరిస్థితి ఉండదని భావించామన్నారు. ఆ సమయంలో తాను చేసిన పని కరెక్టేనని మండవ వెంకటేశవర్ రావు చెప్పారు. అయితే తండ్రి తర్వాత తండ్రి లాంటి ఎన్టీఆర్ను గద్దె దించడంలో తాను పాలుపంచుకోవడం అనివార్యంగా మారిందన్నారు.ఈ ఘటన తన రాజకీయ జీవితంలో తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు.
మావోయిస్టులు కితాబిచ్చారు
1989లో రెండో సారి డిచ్పల్లి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు పర్యటిస్తున్న సమయంలో ఓ గ్రామంలో లైబ్రరీని ప్రారంభిస్తుండగానే నక్సలైట్లు వచ్చి తనను కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు ఆ సమయంలో తాను గన్మెన్లతో తిరిగేవాడిని కాదని చెప్పారు. ఐదు రోజుల పాటు మావోయిస్టులు తమ వద్దే ఉంచుకొన్నారని చెప్పారు. జైలులో ఉన్న నక్సలైట్లను విడిపించుకొనేందుకు తనను కిడ్పాప్ చేశారని చెప్పారు. ఆ సమయంలో తనను చంపుతారనే భయపడలేదని చెప్పారు. కానీ, తాను తప్పు చేశానని ప్రజల ముందు అవమానిస్తారమోనని భయపడ్డానని మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు. ఓ గ్రామంలో తాను ప్రజలకు ఏ రకంగా సేవ చేసిన విషయాన్ని ఓ గిరిజనుడు నక్సలైట్ల దృష్టికి తీసుకురావడంతో నక్సలైట్లు తనకు కితాబు ఇచ్చారని మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు.
రేడియోలో నక్సలైట్లు వార్తలు తెలుసుకొన్నారు
తనను కిడ్పాప్ చేసిన తర్వాత తన భార్య నళిని నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగిందన్నారు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని రేడియోలో వచ్చిన వార్తల ద్వారా మావోయిస్టులతో పాటు ఆనాడు తాను కూడ తెలుసుకొన్నానని చెప్పారు. తన భార్య ఆరోగ్యం క్షీణించడం, తండ్రి ఆసుపత్రిలో చికిత్స కోసం ఉన్న విషయం తెలుసుకొని మనసులోనే తీవ్రంగా కలత చెందానని మండవ వెంకటేశ్వర్ రావు చెప్పారు. తన తండ్రి కమ్యూనిష్టు భావాలున్న వ్యక్తని, తనకు కూడ ఆ భావాలు నేర్పాడని మావోయిస్టులకు గుర్తు చేస్తే తన తండ్రిని చూసుకొనేందుకు చాలా మంది ఉన్నారని మావోయిస్టులు గుర్తుచేశారని చెప్పారు .
తెలంగాణలోనే పుట్టాను
తమ పూర్వీకులు ఆంద్రప్రాంతం నుండి 1940లోనే నిజామాబాద్ జిల్లాకు వచ్చారని చెప్పారు.ఆనాడు నిజామాబాద్ జిల్లా నైజాం రాష్ట్రంలో ఉందన్నారు. తాను 1940లో నిజామాబాద్ జిల్లాలోనే పుట్టానని మండవ వెంకటేశ్వర్ రావు గుర్తు చేశారు. తాను స్థానికేతరుడనే ప్రచారం ఎవరైనా చేస్తే తాను నవ్వుకొంటానని ఆయన చెప్పారు.