Manchireddy Kishan Reddy: రెండో రోజు ఈడీ విచారణకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. కీలక విషయాల వెల్లడి..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మంచిరెడ్డిని మంగళవారం విచారించిన అధికారులు.. బుధవారం మరోసారి విచారిస్తున్నారు. ఆయన్ని మంగళవారం ఈడీ అధికారులు 9 గంటల పాటు విచారించారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన క్యాసినో కేసులో కిషన్ రెడ్డిని విచారిస్తున్నారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డి
మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2014 ఆగస్టులో విదేశాలకు వెళ్లారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించినట్లు తెలిసింది. విదేశాలకు వెళ్లే ముందు ఫారెక్స్ కార్డ్ కూడా తీసుకెళ్లినట్లు ఈడీ గుర్తించింది. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. మంచిరెడ్డి విదేశాల్లో కేసినో ఆడారని.. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

చీకోటి ప్రవీణ్ విచారణ
చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద 2015లో రిజిస్టరైన కేసుల్లో వివరాలను ఈడీ వాకాబు చేస్తోంది. ఇందులో భాగంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిసింది.

సంతకాలు
విదేశీ టూర్స్ , పెట్టుబడులు, ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్స్ గురించి నిన్న ప్రశ్నించినట్లు సమాచారం. ఫారిన్ టూర్స్ లో జరిగి ట్రాన్సాక్షన్స్ లెక్కలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. ప్రతి స్టేట్ మెంట్ పై ఆయన సంతకాలు తీసుకున్నారని తెలుస్తోంది.

అరెస్ట్ చేయాలి
మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, కేసినో, జూదంలో నిందితుడిగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని వెంటనే విచారించాలన్నారు. తెరాస ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయించాలని డిమాంట్ చేశారు. ఇప్పటికే ఎన్నో సార్లు అతనిపై ఆరోపణలు వచ్చాయని మల్ రెడ్డి రంగారెడ్డి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications