Rains in Telangana : రాబోయే 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రెండు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. బుధ,గురువారాల్లో రాష్ట్రంలో వర్షాలు నమోదు కాలేదు. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 15న ఆదిలాబాద్,కుమ్రం భీం,ఆసిఫాబాద్,మంచిర్యాల,జగిత్యాల,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2021
హైదరాబాద్లో శుక్రవారం(సెప్టెంబర్ 10) సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31డిగ్రీలుగా,కనిష్ట ఉష్ణోగత్రలు 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రెండు రోజుల క్రితం వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.వాగులు, వంకలు, పొంగి పొర్లడంతో చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు.
కరీంనగర్లో 15 కాలనీలు వరద నీటితో జలమయమయ్యాయి.సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను వరద ముంచెత్తింది. కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంటతో పాటు నిజామాబాద్,నిర్మల్ జిల్లాలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది.ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాయల దుర్గాభవాని ఆలయాన్ని మూసివేశారు.