తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు: ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు విపరీతమైన ఎండలు మండిపోతుండగా.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతోంది. తాజాగా, మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
బుధవారం ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులపాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు ప్రాంతాల్లో వర్షలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, బుధవారం తెలంగాణ, ఏపీల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, మంగళవారంనాడు తెలంగాణలో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్లో 34.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications