మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
మండుతున్న ఎండల వేళ రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. నేటి నుంచి ఐదు రోజులపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ళు, పిడుగులకు అవ కాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటుగా తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ వర్షాలు కొనసాగనున్నాయి. అకాల వర్షాలతో రైతులకు అలర్ట్ జారీ చేసారు. ఇక, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఆదివారం నుంచి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది.ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో రెండు విడతల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. అలాగే ఈనెల 16 నుంచి 20వ తేదీ మధ్య కొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో అత్యధికంగా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అకాల వర్షాలు... తాజా హెచ్చరికలు
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ 39 డిగ్రీల వరకు ఎండలు కాశాయి. అకాల వర్షాల పైన హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఈ సమయంలో కేవలం వర్షమే కాకుండా, సెకనుకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. దీంతో మామిడి ఇతర పంటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వడగళ్ల వానలకు దెబ్బతినే ప్రమాదం ఉంది. పిడుగుల బారిన పడి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నందున, ఉరుముల సమయంలో ఎవరూ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో స్తంభాల కింద ఉండకూడదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications