రోహిత్: 6 గం.లు ఎందుకు.. ఎన్నో ప్రశ్నలు, ఫోరెన్సిక్కు సూసైడ్ నోట్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఏబీవీపీ - ఏఎస్ఏలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలే ఆత్మహత్యకు బాధ్యత వహించాలని ఏఎస్ఏ ఆరోపిస్తోంది.
అయితే, రోహిత్ ఆత్మహత్య చేసుకునే రకం కాదని, ఆయన ఎందరు వచ్చినా ఎదుర్కోగలడని, అలాంటి వ్యక్తి బలమైన కారణం లేకుండా ఆత్మహత్య చేసుకుంటే తాము నమ్మలేమని, దీని వెనుక కొందరు ప్రొఫెసర్లు ఉన్నారని ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వీరి వాదన ఇలా ఉండగా, రోహిత్ సూసైడ్ లేఖ, అతని ఆత్మహత్యను గుర్తించేందుకు తీసుకున్న సమయం.. తదితరాల పైన పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. రోహిత్ సూసైడ్ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దీనిని పరిశీలిస్తున్నారు.
రోహిత్ తన సూసైడ్ లేఖలో కొంత కొట్టి వేశాడు. దానిని తానే కొట్టివేసినట్లు అతను సంతకం కూడా చేశాడు. అయితే దీని పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అది అతనే కొట్టివేశాడా లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికలో తేలనుంది.
రోహిత్ ఆ కొట్టివేసిన చోట.. తన సొంత సంస్థ ఏఎస్ఏ గురించి రాశాడా? లేక మరేదైనా రాశాడా అనే చర్చ సాగుతోంది. అలాగే, అతను ఆత్మహత్య చేసుకున్న దాదాపు ఆరు గంటల తర్వాత గుర్తించారు. అంత సమయం ఎందుకు పట్టిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావులు రాజీనామా చేయాలని ఏఎస్ఏ డిమాండ్ చేస్తోంది. మరోవైపు సొంత సంస్థ, ప్రొఫెసర్ల ఒత్తిడి వల్లే రోహిత్ ఆత్మహత్య కావొచ్చని, ఈ కోణంలో దర్యాఫ్తు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.