Shami: టీమిండియాలో మతం చిచ్చు: ముస్లిం ప్లేయర్‌పై ధ్వేషం..వివక్ష: అంతా బీజేపీ: ఒవైసీ ఫైర్

హైదరాబాద్: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసింది. చేదు ఫలితాన్ని ఇచ్చింది. టీమిండియా అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోవడానికి ఇష్టపడని రిజల్ట్ ఇది. చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు.. ఏకపక్షంగా భారత్‌పై విజయం సాధించింది. తన చిరకాల కోరికను ఘనంగా నెరవేర్చుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో భారత జట్టుపై విజయఢంకా మోగించింది. దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తోన్న పరాజయానికి అడ్డుకట్ట వేసింది.

వికెట్ నష్టపోకుండా..


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్.. దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా- 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ టీమ్.. అలవోకగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురు..

టీమిండియాలో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. తమ సత్తాకు తగినట్టుగా ఆడలేకపోయారు. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 36 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మరెవ్వరూ ఆ స్థాయిలో ఆడలేకపోయారు. ప్రత్యేకించి- ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ. వారిద్దరూ ఘోరంగా విఫలం కావడంతో బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. ఒత్తిడిని తట్టుకోలేక.. కుప్పకూలింది.

బౌలర్ల విఫలం..

ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. అర్ధ సెంచరీలు చేశారు. బాబర్ ఆజమ్-52 బంతుల్లో రెండు సిక్సర్లు ఆరు ఫోర్లతో 68 పరుగులు, రిజ్వాన్-55 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 79 పరుగులు చేశారు. నాటౌట్‌గా నిలిచారు. టీమిండియాలో ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావాన్ని చూపలేకపోయారు. వికెట్లను తీయడంలో దారుణంగా విఫలం అయ్యారు. మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులను సమర్పించుకున్నారు.

షమీ విఫలం..

ప్రత్యేకించి మహ్మద్ షమీ. చాలాకాలం పాటు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కు బ్యాక్‌బోన్‌గా ఉంటూ వస్తోన్న షమీ ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3.5 ఓవర్లను సంధించిన అతను 43 పరుగులను సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఎకానమీ.. 11.21గా రికార్డయింది. అంటే ఓవర్‌కు 11 పరుగులను ఇచ్చుకున్నాడు. బౌలర్లందరి కంటే అత్యధికంగా పరుగులను ఇచ్చుకున్నది షమీనే. ఇది కాస్తా అతనిపై ఆగ్రహావేశాలకు దారి తీసినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో షమీకి వ్యతిరేకంగా వేలాది పోస్టులు పడుతున్నాయి.

షమీని టార్గెట్ చేసిన సోషల్ మీడియా..

ఈ పరిణామాల మధ్య టీమిండియా బౌలింగ్ వెన్నెముక మహ్మద్ షమీని సోషల్ మీడియా టార్గెట్ చేసింది. పలువురు నెటిజన్లు అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్నారు. వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షమీకి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. షమీని దూషిస్తూ అతని ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్‌పై షమీ పక్షపాత ధోరణిని ప్రదర్శించాడని, తోటి ముస్లిం జట్టు కావడం వల్లే తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయాడంటూ మండిపడుతున్నారు.

స్పందించిన ఒవైసీ..

సోషల్ మీడియాలో షమీకి వ్యతిరేకంగా పోటెత్తుతున్న జాత్యహంకార వ్యాఖ్యలపై అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి మహ్మద్ షమీ ఒక్కడే బాధ్యుడా? అంటూ నిలదీశారు. దేశంలో ముస్లింల పట్ల ఎంత ధ్వేషం వ్యక్తమౌతున్నదో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు.

జట్టు మొత్తానిదీ బాధ్యత..

ఈ ఓటమికి భారత జట్టు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందే తప్ప.. ఏ ఒక్కరికో దాన్ని అంటగట్టడం సరికాదని ఒవైసీ అన్నారు. ముస్లిం కావడం వల్లే మహ్మద్ షమీని సోషల్ మీడియా టార్గెట్ చేసిందని ఆరోపించారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని విమర్శించారు. సంఘ్ పరివార్ కార్యకర్తలు ముస్లిం ప్లేయర్‌కు వ్యతిరేకంగా ఇలాంటి విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బకొడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

సెహ్వాగ్ సైతం..

మ్యాచ్ ముగిసినప్పటి నుంచీ #Shami పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. అతణ్ని విమర్శిస్తూ, ధ్వేషపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ వేలాదిమంది పోస్టులు పెడుతున్నారు. దీనిపట్ల టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. జట్టు ఓటమికి షమీని ఒక్కడినే బాధ్యుడిని చేయడం, వ్యక్తిగతంగా, మతంపరంగా దూషించడం సరికాదని అన్నారు. షమీకి నైతికంగా అండగా నిలవాలని సూచించారు. తాను షమీకి అండగా నిలుస్తున్నానని అన్నారు. మ్యాచ్‌లో గెలుపోటములు సహజమేనని, దానికి ఒక కులానికో లేదా మతానికో.. పూయాలనుకోవడం సరికాదని చెప్పారు.

పాకిస్తాన్‌గా చూడొద్దు..

మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి పట్ల మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. క్రీడల్లో గెలుపోములు సహజమే అయినప్పటికీ.. దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలే తప్ప.. వ్యక్తిగత విమర్శలకు దిగకూడదని అన్నాడు. ఒక క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోయినట్టుగానే భావించాలి తప్ప.. పాకిస్తాన్ చేతిలో పరాభవానికి గురైనట్లు తీసుకోకూడదని హితవు పలికాడు. ఇలాంటి విధ్వేషపూరిత వైఖరికి తెర పడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+