ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై బండి సంజయ్ హెచ్చరిక
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులతో అమలు చేసే పథకాలకు ఆ పార్టీ నేతల పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోచన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు 'ఇందిరమ్మ' పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసేది లేదని హెచ్చరించారు.
కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ముద్రించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చినా గత ఐదేళ్లలో ఏనాడూ బీఆర్ఎస్ నేతలు తనను పిలవలేదన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తాను నిధులు తెస్తే.. బీఆర్ఎస్ నేతలు పనులు ప్రారంభించారన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులను దారిమళ్లిస్తే.. కొట్లాడి మరీ అడ్డుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించిన నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగిందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పాలనతో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫాంహౌస్ సహా అన్ని స్కాంలు మరుగునపడ్డాయన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ రేపే అరెస్ట్ అంటూ నెల రోజులు ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతో కరీంనగర్ లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనేది నిజం. స్మార్ట్ సిటీ నిధులతో, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన వివిధ నిధులతో కరీంనగర్ లో గల్లీగల్లీ అభివృద్ధి చేశాం, చేస్తున్నాం. ఇక మీద కూడా కరీంనగర్ అభివృద్ధి… pic.twitter.com/dkqKEdC58U
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 25, 2025
మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారని.. అయితే, భూకబ్జాలకు పాల్పడేవారిని బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications