విషాదం: డాక్టర్ రాలేననడంతో గర్భిణీకి కాన్పు చేసిన నర్సులు, శిశువు మృతి
నల్గొండ: సూర్యపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించి ఓ శిశువు మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానసకు కాన్పు కోసం ఆస్పత్రిలో చేర్చారు.
మంగళవారం తెల్లవారుజామున మానసకు నొప్పులు రావడంతో అక్కడి సిబ్బంది వైద్యురాలికి సమాచారం అందించారు. ఆమె రాలేనని చెప్పడంతో నర్సులే నిర్లక్ష్యంగా కాన్పు చేశారు. ఆ తర్వాత శిశువుకు ప్రమాదం ఉందని.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం.. అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పడంతో శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శిశువు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మద్యం మత్తులో కుమార్తెను నేలకేసి కొట్టిన దుర్మార్గుడు : కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. మద్యం మత్తులో అత్యంత కర్కశంగా నేలకేసి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నవులూరు ఎంఎస్ఎస్ కాలనీకి చెందిన మునగపాటి గోపీకి మూడేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం పాప పుట్టింది. ఆమెకు లక్ష్మీ పద్మావతి అనే పేరు పెట్టారు. ఆరు నెలల క్రితం మరో పాప జన్మించింది.
ఈ క్రమంలో ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ గోపీ తరచూ మద్యం తాగి వచ్చి తల్లీకుమార్తెలపై దాడికి పాల్పడేవాడు గోపి. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న లక్ష్మీపద్మావతిని చేయి పట్టుకుని ఈడ్చి నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుమార్తెను తల్లి స్థానికుల సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిని కొట్టి చంపిన గోపీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications