ఎర్రబెల్లి పిలిస్తే రేవంత్ రెడ్డి నో!, గొప్పలని లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల మధ్య అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా సోమవారం శాసన సభ పదినిమిషాలు వాయిదా పడింది.
ఈ సమయంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు సభాపతిని కలిసేందుకు ఆయన ఛాంబరుకు వచ్చారు. బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అప్పటికే సభాపతి చాంబరుకు చేరుకున్నారు. అయితే, ఎర్రబెల్లి మాత్రం రేవంత్ కోసం ఆగారు. సభాపతి చాంబర్ ఎదుట నిల్చున్నారు. ఆ సమయంలో రేవంత్ను చూసి పిలిచారు. ఆయన విలేకరులతో మాట్లాడుతున్నారు. నేను రాకుంటే ఏంటి, మీరు వెళ్లి మట్లాడంటి అంటూ సమాధానం చెప్పారు.
కాగా, మంగళవారం డాక్టర్ కే లక్ష్మణ్ శాసన సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం గొప్పలకు పోయి లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. అందరి భాగస్వామ్యంతో తెలంగాణ ఏర్పడిందని, అందరి మనోభావాలు గౌరవించాలన్నారు. అమరుల త్యాగఫలితమే తెలంగాణ అన్నారు. బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజలను బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.
బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేం లేదన్నారు. పక్క రాష్ట్రం లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న పోటీతోనే ఇక్కడ బడ్జెట్ను కూడా లక్ష కోట్లు దాటించారన్నారు. బడ్జెట్లో పేర్కొన్న నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. రూ.82,200 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో తెలిపారని, రూ.36 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారని, కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయో చెప్పాలన్నారు.
బడ్జెట్ రూపొందించడం కోసం అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేశారన్నారు. తీరా చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో లెక్కలేనన్ని ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని, ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులను పరామర్శించాల్సి రావడం బాధాకరమన్నారు.