Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేవుళ్లకే రక్షణ లేదు..! ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయం

హైదరాబాద్ : తెలంగాణ ఆలయాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. బయటనుంచి వచ్చిన దొంగలు కాదు.. ఇంటిదొంగలే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు కాజేస్తున్నారు. విషయం బయటపడదులే అనుకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాసర.. నేడు కొమురవెల్లి మల్లన్న ఇంటి దొంగలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఆలయాల్లో ఇంటి దొంగల వ్యవహారాలు చాలానే జరుగుతున్నా.. ఒకటి, రెండు సంఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయనే వాదనలున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు కన్నం వేస్తున్న ఇంటి దొంగల గుట్టురట్టవుతున్నా.. ఇక స్వతంత్ర కమిటీల నేతృత్వంలో నడిచే ఆలయాల్లో జరిగే దోపిడీ ఘటనల గురించి బయటపడని నిజాలు చాలానే ఉంటాయనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం.

గుడిలో ఇంటి దొంగలు..!

గుడిలో ఇంటి దొంగలు..!

సిద్దిపేట సమీపంలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం సంవత్సరం పొడవునా భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది. భక్తులకు కొంగు బంగారమై నిలుస్తున్న మల్లన్న స్వామిని కొలిచేందుకు దూరప్రాంతాలు లెక్క చేయకుండా కొమురవెల్లికి వస్తుంటారు. ఆ క్రమంలో మొక్కులు తీర్చుకుంటూ కానుకలు సమర్పిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన హుండీ లెక్కింపుల్లో బంగారం నాణ్యత పరిశీలించే స్వర్ణకారులు చేతివాటం ప్రదర్శించారు.

సాధారణంగా నగదు కానుకలను ఆలయ ఉద్యోగులతో పాటు సేవా సమితి సభ్యులు లెక్కిస్తుంటారు. బంగారు కానుకల విషయానికి వచ్చేసరికి వాటి నాణ్యతను పరిశీలించడానికి స్థానికులైన స్వర్ణకారులకు పని అప్పగిస్తారు. అదే అదనుగా బూర్గుల శ్రీనివాసచారి, బూర్గుల కిషన్‌ చారి దాదాపు 2 తులాల బరువుండే బంగారు నెక్లెస్‌ను మాయం చేసి తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దేశారు. అలాగే మరో తులం వెయిట్ ఉండే బంగారు ఆభరణాలను షర్ట్ జేబుల్లో వేసుకున్నారు. అయితే వారు బయటకు వెళ్లే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తనిఖీ చేయగా విషయం బయటపడింది. ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బాసర ఆలయంలోనూ ఇదే తంతు..!

బాసర ఆలయంలోనూ ఇదే తంతు..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం వివాదాల సుడిగుండంగా మారుతోంది. అప్పట్లో రాజగోపురం కలశాలు మాయం కావడం పెద్ద దుమారమే రేపింది. అంతకుముందు సాక్షాత్తు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని.. ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి తరలించడం వివాదస్పదమైంది. అలా ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్న తీరు భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.

ఇటీవల అమ్మవారి మూల విరాట్ విగ్రహం పైనున్న మకుటంలోని నవ వజ్రాల్లో ఒకటి కనిపించకుండా పోవడం ఆందోళనకు దారితీసింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి విచారణకు ఆదేశించినా.. ఇంతవరకు దాని జాడ మాత్రం దొరకలేదు.

దేవాదాయ శాఖ చూసీచూడనట్లు..!

దేవాదాయ శాఖ చూసీచూడనట్లు..!

మొత్తానికి ఆలయాల్లో ఇంటి దొంగలు రెచ్చిపోతున్నా.. దేవాదాయ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందోనే ఆరోపణలున్నాయి. భక్తులు సెంటిమెంట్‌గా దేవుళ్లకు సమర్పించే కానుకలు మాయం అవుతుండటం వివాదస్పదమవుతోంది. ఇంటి దొంగలను నిలువరించే ప్రయత్నాలు చేయకపోవడం ఆలయాల ప్రతిష్ట దిగజార్చుతుందనే వాదనలు కొకొల్లలు.

ఆలయాల నిర్వహణ వ్యవస్థ లోపభూయిష్టమే దొంగలు రెచ్చిపోయేలా అవకాశం కల్పిస్తోందని అంటున్నారు భక్తులు. చాలా ఆలయాల దగ్గర సెక్యూరిటీ లేని కారణంగా గతంలో బయటి దొంగలు కూడా చేతివాటం ప్రదర్శించిన సంఘటనలు అనేకం. ఇలా దొంగలంతా కలిసి ఆలయాల మీద పడుతుంటే.. దేవాదాయ శాఖ మాత్రం ప్రత్యామ్నాయ చర్యలేవి తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+