కుంభ మేళా స్పెషల్ ప్యాకేజీ , వయా అయోధ్య - ట్రైన్ షెడ్యూల్, ధరలు..!!
మహా కుంభమేళా కు సమయం సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా మహాకుంభ మేళాకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయటం పవిత్రంగా భావిస్తారు. భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి కుంభమేళాకు తరలి వస్తారు. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా కుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య దర్శనం కలిగేలా కొత్త ప్యాకేజీ ఖరారు చేసింది. ఈ రైలు తేదీలు, ధరలు వెల్లడించింది.
హైదరాబాద్ నుంచి మొదలు
ఐఆర్సీటీసీ ప్రకటించిన ఈ మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీ టూర్ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగుతుంది. మొదటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో మీదుగా కొనసాగుతుంది. రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 8 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్కు వెళ్లి అక్కడ చెకిన్ అయ్యి లంచ్ పూర్తి చేస్తారు. సాయంత్రం గంగా హారతి వీక్షించి.. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

టూర్ షెడ్యూల్
నాలుగో రోజు ఉదయం ప్రయాగరాజ్ బయలుదేరుతారు. ఆ తర్వాత కుంభమేళా దగ్గరకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ రాత్రికి ప్రయాగరాజ్లోని టెంట్ సిటీలో బస కల్పిస్తారు. ఐదో రోజు ఉదయం వారణాసి బయలుదేరుతారు. కాశీ విశ్వనాథ్, కాశీ విశాలక్ష్మీ, అన్నపూర్ణ దేవి ఆలయాల ను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బసకు ఏర్పాటు చేస్తారు. ఆరో జు అయోధ్యకు వెళ్తారు.అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అయోధ్య నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసారు.
జనవరి 19న ప్రారంభం
ఇందు కోసం ఛార్జీలను ఖరారు చేసారు. ఎకానమీ(SL) క్లాస్లో పెద్దలకు రూ. 22,635, 5 నుంచి 11 సంవ్సతరాల చిన్నారులకు రూ.21,740గా ధర నిర్ణయించారు. స్టాండర్డ్(3AC)లో పెద్దలకు రూ.31,145, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.30,095 గా నిర్ణయించారు. కంఫర్ట్ (2AC) లో పెద్దలకు రూ.38,195, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.36,935 చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాత్ర జనవరి 19, 2025వ తేదీన ప్రారంభమవుతుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications