రేవంత్ రెడ్డి ప్లాన్కు బాబు ఓటు: కెసిఆర్పై పోరుకు ఉమ్మడి కూటమి సై
తెలంగాణలో మూడున్నరేళ్ల క్రితం జతగా సాగిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు తలో దారిన పయనిస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొసగటం లేదు.బీజేపీ, టీడీపీ ప్రస్తుతానికి ఉప్పూ నిప్పుగా మార
హైదరాబాద్: తెలంగాణలో మూడున్నరేళ్ల క్రితం జతగా సాగిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు తలో దారిన పయనిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొసగటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ వివిధ నిర్ణయాలను తప్పుపడుతూ తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) వంటి కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఉమ్మడిగా వేదికను పంచుకుంటున్నా బీజేపీ, టీడీపీ ప్రస్తుతానికి ఉప్పూ నిప్పుగా మారకున్నా, క్రమంగా వాటి మధ్య దూరం పెరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీకి రెండు పార్టీలూ సిద్ధమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగినా అప్పటికే తెలంగాణ ఏర్పాటు ఖరారైంది. రాష్ట్ర సాధన ఉద్యమంలో, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ క్రియాశీలక పాత్ర పోషించింది.
టీడీపీ మాత్రం అప్పటి రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో దూకుడు ప్రదర్శించలేకపోయినా, 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ.. ఇరు ప్రాంతాల్లోనూ (ఆంధ్ర, తెలంగాణ) కలిసి పోటీ చేశాయి. అదే ఏడాది జూన్ రెండవ తేదీ నుంచి తెలంగాణలో అమలులోకి వచ్చింది. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒంటరిగా పోటీ చేసిన టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు సాధించి తెలంగాణ నూతన రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు తెలంగాణలో టీడీపీ 15 అసెంబ్లీ స్థానాలు, మల్కాజిగిరి లోక్సభ స్థానాన్ని గెల్చుకున్నది.
టీడీపీతో పొత్తు వల్ల నష్టపోయామని బీజేపీ నేతలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాలు, సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో విజయం సాధించింది. తెలంగాణ ప్రజల్లో టీడీపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం తమపై పడిందని, అందువల్లనే తమకు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదని కమలనాథులు వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో విడతల వారీగా సుదీర్ఘ కాలం పొత్తు వల్ల చాలా నష్ట పోయామని, ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వచ్చిందని, ఒంటరిగా పోటీ చేసినా తమ ఓట్ల శాతం పెరిగిందంటూ గణాంకాలను చూపుతున్నారు.
ఇక నాయకులు తప్ప కార్యకర్తలు పెద్దగాలేని బీజేపీకి తమతో పొత్తు వల్లే 2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైనా ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం దక్కాయని తెలుగు తమ్ముళ్లు సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తాము ఒంటరిగా పోరాడితే సత్ఫలితాలు సాధించగలమని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకలా, తెలంగాణలో మరోలా రాజకీయ పొత్తులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా పొత్తులు పెట్టుకోవడానికి అనుమతినిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలో మాత్రమే పొత్తు ఉంటుందంటున్న బీజేపీ
షెడ్యూల్ ప్రకారం సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే టీడీపీతో పొత్తు ఉంటుందని, తెలంగాణలో ఉండబోదని బీజేపీ ముఖ్య నేతలు ఇటీవల బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎ్సకి తామే ప్రత్యామ్నాయమని, ఒంటరిగా 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసే కార్యాచరణతో కమలనాథులు ముందుకు సాగుతున్నారు. టీడీపీ కూడా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో ద్వంద్వ విధానాన్ని ప్రదర్శిస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
అందుకు తగినట్లుగానే ప్రధాని నరేంద్రమోదీ సహా రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు తెలంగాణలో పర్యటించి ఆయా పథకాల అమలు తీరును పరిశీలించారు. 'సైకిల్' పార్టీ నేతలు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసే సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి మిత్రపక్షాల కూటమితో బీజేపీ కలిసి రావాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే బీజేపీ, కమ్యూనిస్టులు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీలతో కలిసి పోటీ చేసేందుకు సాహసిస్తాయా? లేదా? అంటే 2019 ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకూ వేచి చూడాల్సిందే












Click it and Unblock the Notifications