కేసీఆర్ పారదర్శకత బోగస్సేనా?: తెలంగాణకూ ‘ఎనీవేర్’ జబ్బు, మంత్రి పాత్ర?
రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతం.. సుప్రీంకోర్టు ఆదేశాలు బయటపడ్డ వైనం.. ఆపై తవ్వినా కొద్దీ చేదు నిజాలు బయటపడ్తున్నాయి.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతం.. సుప్రీంకోర్టు ఆదేశాలు బయటపడ్డ వైనం.. ఆపై తవ్వినా కొద్దీ చేదు నిజాలు బయటపడ్తున్నాయి. మియాపూర్ కేంద్రంగా సాగిన ఈ భూదందా లీలలు తవ్వినా కొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
సుప్రీం ఆదేశాలతో పరిస్థితిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర అభివ్రుద్ది సంస్థ (హెచ్ఎండీఏ) ఎండీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. సీఎం కే చంద్రశేఖర్ రావు స్పందిస్తూ రెవెన్యూ శాఖలో ప్రత్యేకించి భాగ్యనగరంలో భారీస్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. కానీ.. ఈ భాగోతంలో రాష్ట్ర క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఒక నేత పాలు పంచుకున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూశాఖ అధికారులు 'ఎనీవేర్' దోపిడీకి తెగబడేందుకు సదరు మంత్రి.. ఆయన పెషీ పూర్తిస్థాయిలో సహకరించారని సమాచారం.
అన్ని విధాల సహకరించినందుకు ఆ మంత్రికి భారీగానే ప్రతిఫలం ముట్టిందనీ, ఎనీవేర్ అక్రమాల తొలి లబ్ధిదారు ఆయనేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేతి బీరకాయలో నెయ్యి చందంగా .. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పాలన సాగిస్తున్నదని, అవినీతికి తావు లేదన్న వాదన ఎంత నిజమో తెలియజేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమాల కోసం రెవెన్యూ అధికారుల పకడ్బందీ ప్రణాళిక
మియాపూర్లోని వందల ఎకరాల వివాదాస్పద, ప్రభుత్వ భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తుల పేరిట జరిపిన అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోకి సదరు అధికారులు పకడ్బందీ ప్రణాళిక రచించారు. కీలకశాఖల మంత్రి, ఆయన పెషీని లాగారు. తద్వారా తమ లావాదేవీలు బయట పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మియాపూర్ భూదందా ప్రారంభించడానికి ముందే వారు, మంత్రికి రెండెకరాల భూమిని ఆఫర్ చేశారు.
రూ.50 కోట్ల విలువైన ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రతిపాదించడంతో మంత్రి కూడా ఆశపడ్డారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేటకు చెందిన ఆయన సన్నిహితుడు ఒకరిని బినామీగా పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి నివాసంలోని ఇద్దరు ఉద్యోగులు సాక్షులుగా సంతకం చేశారు. ఈ వ్యవహారాన్ని మంత్రి పేషీలో పనిచేసే ఓ అధికారి స్వయంగా పర్యవేక్షించారు. సదరు సబ్ రిజిస్ట్రార్తోనే రిజిస్ట్రేషన్కు అవసరమైన స్టాంప్ డ్యూటీని సబ్-రిజిస్ట్రార్తోనే కట్టించారని తెలిసింది. ఆయనకు అక్కడ పోస్టింగ్ ఇప్పించింది మంత్రేనని, ఇలా కృతజ్ఞత తెలుపుకున్నారనీ తెలిసింది.
ఒకరి తర్వాత మరొక రిజిస్ట్రార్ ఇలా
మంత్రికి ముడుపులు చెల్లించుకున్న అధికారులు, అదే ధైర్యంతో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంతో దోపిడీని కొనసాగించారు. మియాపూర్ గిఫ్ట్ గురించి తెలుసుకున్న మరో సబ్-రిజిస్ట్రార్, అదే మంత్రి అనుమతితోనే మరో ఏడు రిజిస్ట్రేషన్లు చేయించినట్లు తెలిసింది. నిజానికి మూసాపేటలో పని చేస్తున్న ఓ సబ్-రిజిస్ట్రార్పై తీవ్ర ఆరోపణలు రావడంతో, సీఎంవో జోక్యం చేసుకుని ఆయన్ని బదిలీ చేసిందని విమర్శలు ఉన్నాయి.
సదరు సీనియర్ మంత్రి జోక్యం చేసుకొని, ఆ అధికారికి అదే జిల్లాలో పోస్టింగ్ ఇప్పించారు. దీంతో మూసాపేట కేంద్రంగా జరిగే లావాదేవీలు బాలానగర్కు మారాయి. అదే సమయంలో మియాపూర్లో భారీగా వివాదాస్పద భూములు ఉన్నాయని గుర్తించిన మంత్రి, ఆయన పేషీ అక్కడ తమ సన్నిహితుడికి పోస్టింగ్ ఇప్పించారని తెలుస్తున్నది. వీరిపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రతిపాదించినా, ఉన్నతస్థాయిలో తొక్కిపెట్టారని వార్తలు వస్తున్నాయి.
పెషీ సహకారంతోనే యదేచ్ఛగా అక్రమాలు
వివాదాస్పద భూమిలో వాటా కొట్టేసిన సదరు మంత్రి, జరుగుతున్న దందాను పట్టించుకోకపోవడమే కాక, అక్రమార్కులకు సహకరించినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 'ఎనీవేర్' విధానంలో అవకతవకలు జరుగుతున్నాయని ఎప్పుడో బయటపడినా.. రిజిస్ట్రేషన్ విభాగంలోని అధికారి ఒకరు దీన్ని ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి తెచ్చారు.
లొసుగులను సరిదిద్దేదాకా ఈ విధానాన్ని ఆపేయాలని సిఫారసు చేశారు. లేదంటే... ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు పరిధిలోని భూమిని మరో కార్యాలయంలో రిజిస్టర్ చేయాలంటే, సంబంధిత డాక్యుమెంట్ను కనీసం 48 గంటలపాటు పెండింగ్లో పెట్టాలని ఏడాది క్రితమే ఆయన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ తరహా ఉత్తర్వులకు పదేపదే రిమైండర్లు పంపారు.
ఇలా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ నిలిపివేతకు సర్క్యులర్
దీన్ని మంత్రి పేషీ దీన్ని అడ్డంగా తొక్కి పెట్టిందన్న విమర్శలున్నాయి. విశేషం ఏమిటంటే... మియాపూర్ భూముల ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, ఆ అధికారి సిఫారసులకు అనుగుణంగా సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. గత ఏడాది 2016, డిసెంబర్ 16వ తేదీన మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ జరిగితే, తర్వాత మూడు రోజులకే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అంటే తాము అనుకున్న భూ దందా కార్యక్రమం ముగిసేదాకా ఆపి, ఆ తర్వాత ఇచ్చారన్నమాట! ఇచ్చారన్నమాటే కానీ సర్క్యులర్ని ఆ తర్వాత కూడా అమలు చేయలేదు. అమలుపై సందేహాలు ఉన్నాయని, వీటిని నివృత్తి చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాసిన లేఖ కూడా సదరు మంత్రి పేషీ బుట్టదాఖలు చేశారని తెలుస్తున్నది.
అక్రమార్కులకు మంత్రి పెషి అండదండలు
సదరు మంత్రి పేషీ అండతోనే ముగ్గురు అధికారులు 'ఎనీవేర్' భూదందాకు తెర లేపగా, ఇటు మంత్రి అప్పనంగా దక్కిన భూమిని అనుభవించే పనిలో పడ్డారు. వివాదాస్పద భూమి స్వాధీనానికి మంత్రి మనుషులు ప్రయత్నిస్తుండగా క్రమంగా పంచాయతీ పెట్టింది. ఈ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న వివాదం మొదలై లోగుట్టు రట్టైంది. దీంతో సీఎం కూడా ఆ మంత్రిపై మండిపడినట్లు తెలిసింది. ఇంత దందా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్పై ప్రభుత్వ పరస్పర విరుద్ధ వాదనలు
మియాపూర్ భూకుంభకోణంలో స్వయంగా ఓఎస్డీ ప్రత్యక్షపాత్రే ఉందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సంబంధిత మంత్రికి ఏ సంబంధం లేదనడం అనుమానాలకు తావిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే సర్కార్ చోద్యం చూస్తున్నదని చెప్తున్నారు. ఈ కేసులో కేవలం సబ్ రిజిస్ట్రార్లపై చర్య తీసుకోవడానికి పరిమితం కాకుండా, సంబంధిత మంత్రిని తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ డిమాండ్లు వినిపిస్తున్నాయి. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వ భూములను కాపాడాలని విశ్లేషకులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications