విటులది తప్పా?వేశ్యలది తప్పా?వ్యభిచార నిర్వహకులది తప్పా?ఎమ్మెల్యేల కొనుగోలులో ఎం జరిగింది?
హైదరాబాద్: ఒక పక్క మునుగోడు ఉప ఎన్నిక, మరోపక్క రాహుల్ గాంధీ జోడో యాత్రతో వాడివేడిగా మారిన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. రాజకీయ ఉత్కంఠ పరిణామాలకు ఒక్కసారిగా తెర లేచింది. దేశ వ్యాప్త సంచలనాలను ఆ ఘటన కేంద్రబిందువుగా నిలిచింది. స్ధానిక మీడియానే కాకుండా జాతీయ స్ధాయి మీడియా దృష్టిని కూడా ఆకర్శించి దేశవ్యాప్త వార్తల్లో నిలిచింది. అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశపై ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది.
తెలంగాణలో కొనుగోలు రాజకీయం.. కీలక మలుపులు తీసుకుంటున్న యవ్వారం..
తెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయాల్లో పార్టీలు మారడం, రాత్రికి రాత్రే మెడలో ఉన్న కండువాతో పాటు ఇంటి మీద ఉన్న పార్టీ జెండా మారిపోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. అంతే కాకుండా బలవంతాగా తమ పార్టీలోకి మారాలనే ఒత్తిడితో పాటు తమ పార్టీలోకి వస్తే ఏ ప్రయోజనాలు ఉంటాయో వివరించి మరీ తమతమ పార్టీల కండువా కప్పుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇంతవరకు కథ మామూలుగానే ఉన్నా పార్టీ మారితే ఇంత డబ్బు ఇస్తామని ముందుగానే ఒప్పందం చేసుకోవడం, అందుకు సంబంధించి ముందస్తు నగదును చెల్లించేందుకు డబ్బు సంచులను తమవెంట తీసుకెళ్లడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.
తెలంగాణ రాజకీయల్లో ఏం జరుగుతోంది. అన్నీ ఆసక్తికర పరిణామాలే
తెలంగాణలో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని వేశ్యలు, విటులు, వేశ్యా గృహాల నిర్వహకులతో పోలుస్తున్నారు కొంత మంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ వ్యభిచారం నేరమా? వ్యభిచారం చేయించడం నేరమా? లేక విటులది నేరమా.?ఈ మొత్తం వ్యవహారం పైన అర్ధరహితమైన అక్రమ వ్యభిచారం కేసులు పెట్టడం నేరమా? అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వాడివేడిగా కొనసాగుతోంది. ఐతే భారతీయ చట్టాల ప్రకారం, వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినప్పుడు విటులతో పాటు వేశ్యలను కూడా పోలీసులు అరెస్టు చేస్తారు, కోర్టులో ప్రవేశపెడతారు. కాని నిర్వహకుల పట్ల మాత్రం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు.
బీజేపి వర్సెస్ టీఆర్ఎస్.. ఢీ అంటే ఢీ అనుకుంటున్న నేతలు
కానీ, కేవలం విటులు అంటూ కొందరిని పట్టుకుని, వేశ్యలను పట్టుకోకుండా వదిలేసి, అర్థ బలం, అంగ బలం, రాజకీయ పలుకుబడి ఉండే నిర్వహకులను కూడా వదిలేసి, వ్యభిచారం కేసు పెడితే విషయ పరిజ్ఞానం కలిగిన న్యాయ స్ధానాలు అటువంటి కేసులు పెట్టినవాళ్లను ఉద్దేశించి ఏ స్ధాయిలో ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి సందర్బాల్లో అసలు వ్యభిచారులు ఎవరో చెప్పకుండా, కనీసం చూపించకుండా, విటులను ఏమార్చిన మద్యవర్తులు ఎవరో తెలియకుండా పోలీసు వ్యవహరించడం కూడా సందేహాలకు తావిచ్చే అంశమే. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వేశ్యలను అరెస్టు చేయకుండా కేవలం విటుల మీదే కేసు పెట్టడం ఏమేరకు న్యాయమనే చర్చ తెలంగాణలో వాడివేడిగా జరుగుతోంది.
ఆ పార్టీకి భూమ్రాంగ్ తప్పదా.? ఢిల్లీకి పాకిని ట్రేడిండ్..
ఇక ఈ ప్రజా ప్రతినిధుల కోనుగోలు అంశంలో మరో కీలక చర్చ కూడా జరుగుతోంది. అత్యంత కీలంగా వ్యవహరించిన "నిర్వహకులు" కళ్లముందే కలతిరుగుతున్నా ఎందుకు పోలీసులు వారిని ప్రశ్నించడంలేదనే సందేహాలు తెలంగాణ ప్రజానికంలో అంతర్లీనంగా ఉత్పన్నమవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఆరోపణలు తెరమీదకు వచ్చాయి గానీ ఆధారాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. మొత్తానికి జరిగిన టోటల్ ఎపిసోడ్ లో వేశ్యలు ఎవరు.? విటులు ఎవరు.? అతి ముఖ్యమైన నిర్వహకులు ఎవరు.?అనే అంశంపై యావత్ తెలంగాణ ప్రజానికానికి ఓ స్పష్టత వచ్చి ఉంటుందా అంటే అది కాలమే నిర్ణయించాలి.