రాష్ట్ర ప్రభుత్వ లీలలు: నిష్ణాతుల కోచింగ్ పేరిట నోటిఫికేషన్.. ఆచరణలో గురుకులాల్లో ఆన్లైన్ శిక్షణ
సివిల్స్ ఉద్యోగం పొందాలని అందరి ఆకాంక్ష. అందుకనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఆచరణలో గురుకులాల్లో ఆన్లైన్లో శిక్షణ
హైదరాబాద్: సివిల్స్ శిక్షణ పొందేందుకు భాగ్యనగరానికి వచ్చిన గిరిజన అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం నిలువునా ముంచిందన్న ఆరోపణలు వినిపించాయి. ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తామని రప్పించిన గిరిజన సంక్షేమశాఖ.. ఆచరణలో వారికి నగర శివారులోని గురుకుల పాఠశాలలో ఆన్లైన్ ద్వారా బోధన ప్రారంభించింది. దీంతో అభ్యర్థులు ప్రారంభంలోనే ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సివిల్స్ కోచింగ్ బహిష్కరించారు. ప్రైవేట్ సంస్థల్లో నిష్ణాతులతో కోచింగ్ ఇప్పిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నా.. ఎలాంటి వసతుల్లేని చోట శిక్షణ ఇప్పిస్తారా? అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తమకు అశోక్నగర్లోని స్టడీ సర్కిల్లోగానీ, ఇతర ప్రైవేట్ శిక్షణా సంస్థల్లోగానీ సివిల్స్ కోచింగ్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. హైదరాబాద్, ఢిల్లీల్లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తున్నది. కానీ హైదరాబాద్ నగరంలో ప్రముఖ సంస్థల్లో శిక్షణ పేరిట రప్పించిన గిరిజన విద్యార్థులకు నగర శివారుల్లోని రాజేంద్ర నగర్ పరిధిలోని గురుకుల పాఠశాలలో శిక్షణనిప్పిస్తామని నమ్మ బలుకుతున్నది. కానీ ఆ నిధులు స్వాహా చేయడానికే గిరిజన సంక్షేమశాఖ అధికారులు 'ఆన్ లైన్' శిక్షణ పేరిట మోసగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రమారమీ రూ.100 కోట్లు చేతులు మారతాయని తెలుస్తున్నది.

ఇలా గురుకులాల్లో శిక్షణకు నిర్ణయం
గిరిజన విద్యార్థులకు సివిల్స్ సర్వీసెస్ ప్రవేశ పరీక్ష శిక్షణ కోసం ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,159 మంది గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో 150 మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో 46 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో నాణ్యమైన ఉచిత శిక్షణ అందిస్తామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో పొందుపర్చింది. శిక్షణ నిమిత్తం సర్కారు రూ.5 కోట్లు కేటాయించింది. అందులో రూ.1.50 లక్షలు విడుదల చేసింది. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ధృవపత్రాల పరిశీలనకు మంగళవారం హాజరు కావాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అభ్యర్థులకు సమాచారం అందజేశారు. తీరా హాజరైన తర్వాత ‘మీకు ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ ఇప్పించడం లేదని, రాజేంద్రనగర్, మహేంద్రహిల్స్లోని గురుకుల పాఠశాలల్లో ఉచిత శిక్షణ అందజేస్తామని, అభ్యర్థులంతా అక్కడే ఉండాలి' అని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి సౌకర్యం లేకపోవడం, మహిళా అభ్యర్థులకు ఏమాత్రం భద్రత లేకపోవడంతో తమకు ప్రైవేట్ శిక్షణా సంస్థల్లోనే ఇప్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.

వసతుల్లేకుండా బోధన ఎలా అని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు
అత్యంత ప్రతిష్టాత్మక సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ను అధ్యాపకులతో కాక కేవలం ఆన్లైన్ ద్వారా బోధన ఉంటుందని చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వచ్చే సందేహాలను ఎవరు తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు. సివిల్స్ శిక్షణకు అవసరమైన ల్యాబ్, లైబ్రరీ వంటి వసతులు కూడా సమకూర్చలేదన్నారు. సివిల్స్లో 500 వరకు ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయని, ఒక్కో విద్యార్థి ఒక్కో సబ్జెక్ట్ తీసుకుంటారని, తమకు వచ్చే సందేహాలను ఆన్లైన్ తీరుస్తుందా? అపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ శిక్షణాసంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక్కో అభ్యర్థిపై రూ.2లక్షలు ఖర్చు చేస్తుంది. అందులో రూ.లక్ష శిక్షణ సంస్థలకు చెల్లించాలి. మరో రూ. లక్షను అభ్యర్థులకు నెలకు రూ.10వేల స్టైఫండ్ చెల్లించాల్సి ఉంది. కానీ ఈ నిధులు ఖర్చు చేయకుండా ఉండేందుకే ఆన్లైన్ ద్వారా అధికారులు విద్యా బోధన చేస్తున్నారని అభ్యర్థులు వివర్శించారు.

ప్రైవేట్ శిక్షణకే అభ్యర్థుల మొగ్గు ఇలా
ఎలాంటి వసతులు లేకుండా ఆన్లైన్ ద్వారా గురుకుల పాఠశాలలో ఇచ్చే శిక్షణ తమకొద్దని, ఆన్లైన్ ద్వారా కాక నేరుగా అధ్యాపకులతో ప్రైవేట్ శిక్షణ సంస్థల్లోనే శిక్షణ ఇవ్వాలని సివిల్స్ కోచింగ్ కోసం ఎంపికైన ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. సివిల్స్లో శిక్షణ అంటే ఆషామాషీ కాదని, దీనికి నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. కాని ప్రభుత్వం కేవలం ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తామంటున్నదని, దీనివల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రయివేటు శిక్షణ సంస్థల్లోనే శిక్షణ ఇప్పించాలని అభ్యర్థిస్తున్నారు.

స్టయిఫండ్ ఇస్తే చాలంటున్న అభ్యర్థులు
సివిల్స్ శిక్షణకు అవసరమైన ల్యాబ్, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు లేకుండా శిక్షణ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ లేకుండా సివిల్స్ పరీక్షలో అర్హత పొందడం అసాధ్యమని, ప్రయివేటు సంస్థల్లోనే శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. తమకు రెసిడెన్షియల్ శిక్షణ అవసరం లేదని, తమకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రయివేటు శిక్షణా సంస్థల్లోనే శిక్షణ ఇప్పించాలంటున్నారు. తమకు చెల్లించాల్సిన స్టైఫండ్ చెల్లిస్తే చాలునని విజ్నప్తి చేస్తున్నారు. రాజేంద్రనగర్లోని గురుకుల పాఠశాలలో తమకు భద్రత లేదని, ప్రయివేటు సంస్థలోనే కోచింగ్ ఇవ్వాలని, అధ్యాపకులు లేకుండా ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తే సివిల్స్ పరీక్షలో అర్హత పొందలేమని మహిళా అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.

కోర్టుకెళతానన్న ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు
సివిల్ సర్వీసెస్ కోసం ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించి అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని టీఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శోభన్ నాయక్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్లో శిక్షణ ఇప్పిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టు ప్రైవేట్ శిక్షణ సంస్థల్లోనే శిక్షణ ఇప్పించి, గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని శోభన్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులను మోసగించిన ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లతానని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు చెప్పారు. కోచింగ్ కోసం విడుదల చేసిన నిధులను దిగమింగడానికే అధికారులు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లోనే అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications