ఐటీ విస్తరణ: హైదరాబాద్లో 45 శాతం పెరిగిన కార్పోరేట్ ఆఫీస్ అద్దెలు
హైదరాబాద్: గత ఐదేళ్లుగా మందగించిన హైదరాబాద్ ఐటీ రంగం ఒక్కసారిగా ఊపందుకుంది. అందుకు కారణం ఇటీవల కాలంలో కార్పోరేట్ ఆఫీసులకు సంబంధించిన అద్దెలు ఒక్కసారిగా 45 శాతం పెరగడమే. జోన్స్ లాంగ్ లాసెల్లీ (జెఎల్ఎల్) ప్రకారం 2009 నుంచి 2010 మధ్య కాలంలో హైదరాబాద్లో చదరపు అడుగు 28-32 వరకు ఉండేది.
కానీ ఇప్పుడు అదే చదరపు అడుగు 43-47 వరకూ ఉందని పేర్కొంది. గతంలో ఉన్న రాజకీయ కారణాలు హైదరాబాద్లో అద్దెలపై తీవ్ర ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో పేర్కొంది. విభజన అనంతరం హైదరాబాద్లో గత రెండేళ్లుగా 15-20 శాతం వరకు అద్దెలు పెరిగాయని జెఎల్ఎల్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ త్రివితా రాయ్ పేర్కొన్నారు.
చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న తరుణంలో కొత్తగా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్త పాలసీలు వస్తాయనే ఆలోచనలో కొంతకాలం పాటు వేచి చూశాయన్నారు. విభజన పూర్తవడంతో పలు కంపెనీలు హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ కోసం చూస్తున్నాయన్నారు.
ఇప్పటికే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాహూ లాంటి కంపెనీలు తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఐటీ కార్యకలాపాలు సైతం ఊపందుకున్నాయి.
గతంలో హైదరాబాద్లో ఉద్యోగాలను కుదించిన పలు కార్పోరేట్ కంపెనీలైన యాక్సెంచర్, యూహెచ్జీ, జెన్ క్యూ, హెచ్ఎస్బీసీ, జేపీఎమ్సీలు ఇప్పుడు విస్తరణ బాట పట్టాయి. ఇప్పటికే హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఐటీ హబ్లలో పలు కంపెనీలు తమ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.
బెంగుళూరుకు చెందిన డెవలపర్ 'పూర్వాంకారా ప్రాజెక్ట్స్' కొండాపూర్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న సంస్థకు చెందిన గ్రేడ్ ఏ ఆఫీసు స్పేస్ను కేవలం నాలుగు రోజుల్లోనే పెట్టుబడిదారులకు అమ్మడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఆకర్షితులైన పెట్టుబడిదారులు ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారనడంలో ఎలాంటి సందేహాం లేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్కు మంచి డిమాండ్ ఉందన్నారు.