తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్
హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ అశోక్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణ పోలీసులు తన సంస్థపై తనపై వేసిన కేసును కొట్టివేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ వేశాడు అశోక్. తను కానీ తన సంస్థ కానీ ఎలాంటి డేటా చోరీకి పాల్పడలేదని కేవలం వ్యాపారపరమైన లావాదేవీలను మాత్రే జరిపినట్లు అశోక్ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక ఏపీకి సంబంధించి రహస్యంగా ఉండాల్సిన ఓటరు డేటా చోరీకి గురైందన్న విషయం వెలుగు చూడటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య హీట్ నెలకొంది. ఈ క్రమంలోనే అశోక్ అమరావతిలో తలదాచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక డేటా చోరీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్లను ఏర్పాటు చేశాయి. దీంతో తెలంగాణ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
కెసీఆర్ డేటా చోరీ..ఓట్లు తొలిగించారు : ఈసి సహకరించింది: బాబు లక్ష్యంగానే: శివాజీ సంచలనం..!
ఇక డేటా చోరీ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్...ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం. తనపై అక్రమంగా కేసులు బనాయించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో వాస్తవాలు లేవని పూర్తిగా కొట్టివేయాలంటూ పిటిషన్లో తెలిపారు. పిటిషన్లో తెలంగాణ పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. అంతవరకు కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అశోక్ వేసిన పిటిషన్ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.