12వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష: నేతల ఇళ్ల ముట్టడికి పిలుపు: ఆర్టీసీ జేఏసీ నిర్ణయం..!
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..అఖిలపక్ష నేతల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసారు. 11న ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తేదీ నుండి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహాదీక్షకు దిగనున్నారు. ఛలో ట్యాంక్ బండ్ ప్రశాంతంగా నిర్వహించామని..పోలీసులు లాఠీఛార్జ్ ను ఖండించారు.
ఈ నెల 13న ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తమ ఉద్యమంలోకి ఇతరులు ప్రవేశించారంటూ చేస్తున్న వ్యాఖ్యలను జేఏసీ నేతలు ఖండించారు. ఇదే సమయంలో ప్రభుత్వ మొండి వైఖరిని తప్పు బట్టారు. 11న హైకోర్టులో ఆర్టీసీ..సమ్మెకు సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమావేశంలో అంచనాకు వచ్చారు.

జేఏసీ నేతల కార్యాచరణ..నిరవధిక దీక్షలు
ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి విపక్ష నేతలు భట్టి విక్రమార్క, సంపత్, కోదండరామ్, వి. హనుమంతరావు, చాడ వెంకట్రెడ్డి, విమలక్క, ఆర్టీసీ జేఏసీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నిన్నటి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
అందులో భాగంగా..11వ తేదీన ప్రజా ప్రతినిధుల నివాసాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తేదీ నుండి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. 13న జేఏసీ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఈ నెల 18న సడక్ బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. అదే సమయంలో ఛలో ట్యాంక్ బండ్ సమయంలో జరిగిన పరిణామాల పైన జేఏసీ నేతలు సమీక్షించారు. పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.
37వ రోజుకు చేరిన సమ్మె..
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. నిన్న ట్యాంక్ బండ్ వద్ద మిలియమ్ మార్చి నిర్వహించిన కార్మికులు ఇవాళ అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపనున్నారు. ఛలో ట్యాంక్ బండ్ నిర్వహణలో భాగంగా.. పోలీసులను గాయపరిచారనే అభియోగంతో నాలుగు కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో పోలీసుల లాఠీ చార్జ్ లో పలువురు కార్మికులు గాయపడ్డారు. తన నిరసన కార్యక్రమాల్లో న్యూ డెమోక్రసీ సభ్యులు ప్రవేశించారంటూ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ నేతలు ఖండించారు. ఇదే సమయంలో సోమవారం కోర్టులో జరిగే వాదనలు..నిర్ణయాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ పైన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications