కన్నీటి పర్యంతమైన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులే కారణమంటూ పదవికి రాజీనామా సమర్పించారు.
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. మూడు సంవత్సరాల పదవీకాలంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఎస్పీని కోరారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు. మూడేళ్లుగా నరకం అనుభవించి ఇప్పడు బయటపడ్డానన్నారు.
కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ మీడియాతో మాట్లాడే సమయంలోనే పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని చైర్ పర్సన్ గా కొనసాగానని, తనకు పదవి దక్కేందుకు కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మంత్రి కేటీఆర్కు శ్రావణి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను పేరుకే మున్సిపల్ చైర్పర్సన్ అని పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని, పలు సందర్భాల్లో నలుగురు తిట్టినా కూడా భరించానని చెప్పారు.
పార్టీ కోసమే ఇన్నాళ్లు కట్టుబడి పని చేశానని, కానీ తమ కుటుంబంపై బెదిరింపులకు దిగడంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానన్నారు. దొర.. మీకో దండం దొర.. పెద్దలు ఆశీస్సులుగా ఇచ్చిన ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని, డాక్టర్ సంజయ్ కుమార్ దొర మీకు దండమని, మీ గడీ నుంచి తాను ఈరోజు బయటపడుతున్నానన్నారు. మీరే గెలిచారన్నారు. బీసీలు ఉన్నత పదవులకు పనికిరారని కంటతడి పెట్టుకున్నారు.
భారత రాష్ట్ర సమితి జగిత్యాలలో రెండు వర్గాలున్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అండతోనే వీరు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 48 వార్డులున్న జగిత్యాలలో 38 మంది బీఆర్ఎస్ కు చెందినవారే. వారిలో 27 మంది శ్రావణిపై తిరుగుబాటు చేస్తున్నారు. శ్రావణి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది వీరి ఆరోపణ.