రజినీకాంత్ ‘జైలర్’ మూవీ కోసం హైదరాబాద్ కంపెనీ హాలిడే, ఫ్రీ టికెట్లు, అక్కడైతే పండగే
హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే ఆయన కోట్లాది మంది అభిమానులకు పెద్ద పండగే. ఇక తమిళనాడులో అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు రజినీకాంత్ కొత్త సినిమా 'జైలర్' విడుదల సందర్భంగా ఆగస్టు 10 రోజున సెలవులు ప్రకటించాయి. తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళలోని పలు కంపెనీలు కూడా సెలవులు ప్రకటిస్తున్నాయి.
తాజాగా, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఓ కంపెనీ కూడా జైలర్ సినిమా విడుదల సందర్భంగా ఉద్యోగులకు హాలీడేను ప్రకటించింది. అంతేగాక, జైలర్ సినిమా టికెట్లను కూడా ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా అందిస్తున్నట్లు హైదరాబాద్లోని దేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు దేశీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఎండీ అజారుద్దీన్ ఒక ప్రకటనల విడుదల చేశారు.

మరోవైపు, యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'జైలర్' విడుదల సందర్భంగా ఆగస్టు 10న తమ ఉద్యోగులకు హాలీడే ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, తమ ఉద్యోగులకు ఉచితంగా టికెట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. తాతల నుంచి మనవళ్ల వరకు అంతా రజినీ అభిమానులమేనని తెలిపింది. చెన్నై, బెంగళూరు, త్రిచ్చీ, తిరునల్వేలి, చెంగల్పట్టు, మత్తుతవని, ఆరపలయం, అలగప్పన్ నగర్ శాఖల్లోని ఉద్యోగులకు కూడా హాలిడే తోపాటు టికెట్లును ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో రజినీతోపాటు పలువురు అగ్రనటులు కూడా కనిపిస్తుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, బాలీవుడ్ అగ్రనటుడు జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు వినాయకన్, ప్రముఖ సినీనటులు తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తుండటం గమనార్హం.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం అంటే ఆగస్టు 10న విడుదల కానుంది. ఇప్పటికే జైలర్ ట్రైలర్కు సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడుతోపాటు కర్ణాకటలోని పలు ఐటీ కంపెనీలు ఆ రోజున సెలవు ఇవ్వడంతోపాటు ఉద్యోగులకు ఉచిత టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications