కేసీఆర్! నీది దొంగ దీక్ష: వీడియో ఆధారాలున్నాయని జైపాల్ సంచలనం
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మహబూబ్నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ చేపట్టిన ఉపవాసదీక్ష ముమ్మటికీ దొంగ దీక్షనేనని, అలాంటి ఆధారాలన్నీ వీడియోతో సహా తన వద్ద సిద్ధంగా ఉన్నాయని జైపాల్రెడ్డి స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ పార్టీపై తిట్ల పురాణంతో రాజకీయాలు చేయాలనుకుంటే నేను నిజంగా నీ బండారాన్ని బయటపెడితేకోలుకోలేవు' అంటూ ఆయన కెసిఆర్ను ఉద్దేశించి హెచ్చరించారు జైపాల్ రెడ్డి. సోమవారం మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన ఆవేదన సభకు జైపాల్రెడ్డితో పాటు ఎమ్మెల్యే డికె అరుణ హాజరయ్యారు.
వీడియో ఆధారాలున్నాయ్..
ఈ సందర్భంగా సభలో మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న కెసిఆర్ చేపట్టిన ఉపవాసం దొంగ ఉపవాసదీక్ష అని ఆరోపించారు. తాను చెప్పే మాటలు అబద్ధం కాదని, ముమ్మటికీ నిజంగానే చెబుతున్నానని, తన దగ్గర అప్పటి వీడియోలన్నీ ఉన్నాయన్నారు. ఖమ్మం ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అక్కడి అప్పటి కలెక్టర్తో తాను కేంద్రమంత్రిగా ప్రతి నిమిషం కెసిఆర్ దీక్ష విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని జైపాల్ అన్నారు. అయితే ప్రతిరోజు కెసిఆర్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. కెసిఆర్కు ఇచ్చినటువంటి అన్ని వసతుల ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మనిషికి కావల్సిన న్యూూట్రిషియన్ 750 క్యాలరీస్కు సంబంధించిన ఇంజెక్షన్లు కూడా కెసిఆర్ తీసుకున్నారని, వీటన్నింటికీ ఆయన ఆమోదంతోనే డాక్టర్లు సైతం వైద్యసేవలు అందించారన్నారు.
అక్కడి నుండి కెసిఆర్ను నిమ్స్కు తరలించాక
తాను నిమ్స్ డైరెక్టర్తో కూడా మాట్లాడనని, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తే డాక్టర్లు సమాధానం విచిత్రంగా చెప్పారన్నారు. మనిషికి కావాల్సిన ఇంజెక్షన్లను కెసిఆర్ తీసుకుంటున్నారని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. అయితే వాటి ఆధారాలు కావాలని నిమ్స్ డైరెక్టర్ను కోరితే ఆధారాలు పంపించారని జైపాల్రెడ్డి వెల్లడించారు. ఆయనకు ఇంజెక్షన్లు ఇచ్చే వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. అప్పట్లో ఈ విషయాలను తాను బయటకు చెబితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే విఘాతం కలుగుతుందని నోరు విప్పలేదని ఆయన అన్నారు.
ఎన్నిసార్లో వచ్చారు..
తన దగ్గరికి తెలంగాణ కావాలంటూ కెసిఆర్ ఎన్నిసార్లు వచ్చారో ఆయనకు బాగా తెలుసని, ప్రస్తుతం ఆయనకు బాగా ఆహంకారం పెరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని, నాయకులను తిట్ల పురాణంతో రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్నారని, రాజకీయాల్లో సంస్కారం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కెసిఆర్ ఒక్కరేనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
నీచ రాజకీయాలు..
తాను 45 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, ఎంపీగా కొనసాగానని ఏనాడు కూడా అపశబ్ధం పలకలేదని, ఎక్కడైనా రాజకీయ నాయకులను ఆయా పార్టీలను విమర్శిస్తే తిట్ల పురాణంతో విమర్శించలేదని, అంశంపైనే మాట్లాడమే తప్పా. కెసిఆర్ మాదిరిగా నీచమైన రాజకీయాలకు ఎప్పుడూ దిగలేదని అన్నారు.
ఒకే కోవకు మోడీ.. కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకే కోవకు చెందినవారని, వీరంతా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా రాజకీయాలకు తెర లేపుతున్నారని విమర్శించారు. కెసిఆర్ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధమయ్యారని, ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తితేనే ప్రజలు ఛీకొడుతున్నారని, ఇది వారి దురదృష్టమని జైపాల్ అన్నారు. బాధ్యత, సభ్యత, సఖ్యత గల నాయకులు పాలకులుగా ఉంటేనే రాజకీయాల్లో విలువలు ఉంటాయని, ఈ మూడు అంశాలు ముఖ్యమంత్రి కెసిఆర్కు లేవని ఆయన వ్యాఖ్యానించారు.