టీడీపీ విలీనం: స్పీకర్పై ధ్వజమెత్తిన జానా, తొందరేంటని రేవంత్, బెదిరింపని డీకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను విలీనం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విలీనంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టం బద్దం కాదని అన్నారు. ఇది అసహ్యమైన, అప్రజాస్వామికమైన చర్య అని విరుచుకుపడ్డారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విలీనం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
అధికారం ఉందని అణగదొక్కే ప్రయత్నం చేయొద్దని టిఆర్ఎస్ పార్టీకి హితవు పలికారు. అవిశ్వాసం పెడతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నెంబర్ లేనిదే అవిశ్వాసం పెట్టడం ఎందుకని అన్నారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంలో కొత్తేమీ లేదని అన్నారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయని చెప్పారు. దీనికే సంబరాలు ఎందుకో అర్థం కాలేదని అన్నారు.
విలీనం చెల్లదు: రేవంత్
టీడీపీ ఎమ్మెల్యేల విలీనం చెల్లదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఫిరాయింపులపై మొదట ఎర్రబెల్లి దయాకర్రావు రాసిన లేఖపై స్పందించకుండా విలీనంపై రాసిన లేఖపై స్పీకర్ అంత తొంతరపడ్డారని ప్రశ్నించారు. విలీనం వెనక రాజకీయ కుట్ర దాగివుందని ఆరోపించారు. స్పీకర్ టిఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించారని మండిపడ్డారు.
అధికారపార్టీది అహంకర వైఖరి: డీకే అరుణ
అధికార పార్టీ టీఆర్ఎస్ తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలను ఆలస్యంగా మొదలుపెట్టి.. ఇప్పుడు శనివారం, ఆదివారం కూడా సభలు నిర్వహిస్తామనడం ఏంటని ప్రశ్నించారు. సాధారణంగా శనివారం, ఆదివారం అంటే సెలవుగా భావిస్తారని, అలాంటిది ఆ రోజుల్లో కూడా సమావేశాలు నిర్వహించడం సరికాదని అన్నారు.
అవసరమైతే తప్పా శని, ఆదివారాల్లో సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఇది అధికార పార్టీ అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. సభలో ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చట్లు, పాటలు పాడుకునేందుకు అసెంబ్లీ సమావేశాలు కాదని అన్నారు.
మార్చి 29 వరకు సమావేశాలు
తెలంగాణ సమావేశాలను మార్చి 29 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, మార్చి 14న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 16న బడ్జెట్పై చర్చ జరగనుంది.