ఆసక్తికరం: చంద్రబాబుతో జానారెడ్డి భేటీ, ‘చింతల యాంగ్రీ యంగ్మ్యాన్’
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం ఓ ఆసక్తికర భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత జానారెడ్డి భేటీ అయ్యారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని చంద్రబాబు ఛాంబర్కు వెళ్లిన జానారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం తెలియరాలేదు. అయినప్పటికీ ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెర లేచింది.
ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జానారెడ్డి.. చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చింతల యాంగ్రీ యంగ్ మ్యాన్: కేటీఆర్
మిషన్ భగీరథపై వాస్తవాలు తెలియకుండా మాట్లాడవద్దని మంత్రి కెటి రామారావు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సూచించారు. శాసనసభలో చింతల మాట్లాడుతూ.. కొన్ని కంపెనీలకు మేలు చేసేలా మిషన్ భగీరథ పనులు చేపట్టారని పేర్కొన్నారు.
ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. చింతల యాంగ్రీ యంగ్ మ్యాన్ అని వర్ణించారు. సీనియర్ నాయకుడు, ఆలోచన ఉన్న వ్యక్తి అనుకున్నా.. ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేస్తారనుకోలేదన్నారు.
మిషన్ భగీరథపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టెండర్ల నిబంధనలు రూపొందించామని తెలిపారు. టెండర్ల ప్రక్రియపై చింతలకు అవగాహన లేదన్నారు. ఆన్లైన్లోనే టెండర్లు ఖరారు అయితాయని చెప్పారు.