పద్ధతి మార్చుకో: కేసీఆర్కు జానా, వ్యాఖ్యల వెనుక!, కేటీఆర్కు 'సిరిసిల్ల' షాక్
హైదరాబాద్: మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి శుక్రవారం భగ్గుమన్నారు. మహారాష్ట్రతో చేసుకుంది చారిత్రక ఒప్పందం కాదని, .చారిత్రక తప్పిదమన్నారు. మహా ఒప్పందంపై కాంగ్రెస్ అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించే శక్తి ఉండాలన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేయవద్దని, అణిచివేసే ధోరణిని విడనాడాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో మాట్లాడిన భాషను ఇప్పుడు వాడొద్దన్నారు.
రాజకీయాలంటే అసహ్యం కలిగేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. చట్టవిరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. అది ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు కూడా వర్తిస్తుందన్నారు. డీపీఆర్ ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రికి లేఖరాస్తే సమాధానం రాలేదన్నారు.
'కేసీఆర్! సన్నాసి ఎవడు?': కొత్త ట్విస్ట్.. ఏపీకి పోలవరంలా.. అడగలేదే!
ఈ ప్రాజెక్ట్తో రూ. 7వేల కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల భారం పడుతుందన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే, తాను ప్రచారం చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ఉద్యమ సమయంలో మీరు ఊతపదాలు వినియోగించి ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి వైఖరి బాగోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ అంశాన్ని గమనిస్తున్నారు. తొలుత కేసీఆర్ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలన్నారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జానా మాట్లాడటం లేదనే వాదనల నేపథ్యంలో ఆయన బయటకొచ్చారని అంటున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో రూ.5 భోజనంను పొగిడిన జానా, ఇటీవల నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ప్రభుత్వానికి కితాబిచ్చారు.
సిరిసిల్ల జిల్లా కోసం రాజీనామా.. కేటీఆర్కు ఝలక్
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను జిల్లా చేయాలంటూ ఏడుగురు మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. బీజేపకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు, ఒక టిడిపి కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు సిరిసిల్లను జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే అఖిలపక్ష నేతలు, లాయర్లు ప్రత్యేక జిల్లా కోసం వంటావార్పు కార్యాక్రమం నిర్వహించారు. కాగా, సిరిసిల్లను జిల్లా చేయాలని తొలుత భావించారు. కొడుకు కేటీఆర్ కోసమే దానిని జిల్లా చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో తగ్గారు. ఇప్పుడు మళ్లీ జిల్లా చేయాలని స్థానికులు ఆందోళన చేయడం కేటీఆర్కు ఓ విధంగా షాక్ అని చెప్పవచ్చు.