జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్టు : నిర్వాసితుల పరామర్శకు పోలీసుల బ్రేక్
మెదక్ : మల్లన్న సాగర్ నిర్వాసితులను కలిసి తీరుతామని ఖరాఖండిగా చెబుతున్న కాంగ్రెస్ కు పోలీసుల బ్రేక్స్ తప్పట్లేదు. ఇప్పటికే ఓసారి నిర్వాసితులను కలిసేందుకు గాంధీభవన్ నుంచి బయలుదేరే ప్రయత్నం చేసి అరెస్టయిన కాంగ్రెస్ నేతలను.. మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. అయితే ముందస్తు సమాచారం అందించినా అరెస్టులకు పాల్పడడం దారుణమంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇక అసలు విషయానికొస్తే.. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు సీఎల్పీ జానారెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ముంపు గ్రామాలకు బయలు దేరారు. అయితే విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ, రూరల్ సీఐ, ఒంటిమామిడి చెక్ పోస్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించి జానారెడ్డి, షబ్బీర్ అలీ వాహనాలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుల అనంతరం నేతలను మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం. ఈ సందర్బంగా మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారులు.. ఎట్టి పరిస్థితుల్లోను విపక్ష నేతలను ముంపు గ్రామాల్లో పరామర్శకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే జానారెడ్డి మాత్రం పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ముందస్తు సమాచారం అందించిన అరెస్టులకు పాల్పడడం బాధాకరమన్నారు.