క్లారిటీ మిస్ అయింది.. దీనిపై జానారెడ్డి మాటేంటో..!
తానైతే పార్టీ మారేది లేదని కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డికి ఇప్పుడో కొత్త ప్రశ్న ఎదురవుతోంది. మీ సంగతి సరే మీ పుత్రరత్నం విషయమేంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. అయితే ఇదంతా బాహాటంగా కాకపోయినా పార్గీ వర్గాల్లో దీనిపై గుసగుసలు మొదలైనట్టుగా ఆ నోటా.. ఈ నోటా వినబడుతున్న మాట ఇది.
పార్టీ మారడమన్నది తన గొంతులో ప్రాణం ఉండగా జరగని విషయమని చెప్పిన జానారెడ్డి.. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ అధికార పక్షం సృష్టిస్తున్న కట్టు కథలేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించి ఉండాల్సిందన్న జానారెడ్డి ఈ విషయం పట్ట ఒకింత అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎల్పీ నేతగా తన నాయకత్వంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాల్సిందేనని ఇందుకోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇదంతా బాగానే ఉంది గానీ.. వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు అధికార పక్షం టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. తన గురించి క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి ఇదంతా ఊహాగానాలకే పరిమితమవుతుందో.. లేక అప్పటివరకు జానారెడ్ది కుమారుడు నిజంగానే పార్టీ మారి ఊహాగానాలను నిజం చేస్తారో..!