ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వాలి - సైదాబాద్ చిన్నారి కుటుంబసభ్యులను జనసేనాని పరామర్శ..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి అత్యాచారం..హత్య ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. పార్టీలకు అతీంగా అందరూ బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఒక చిన్నారి పైన యువకుడి దురాఘాతాన్ని వారంతా ఖండిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైదాబాద్ చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ కల్యాణ్ తెలిపారు.
కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసినప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని పవన్కల్యాణ్ విమర్శించారు. పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి సహాయం..ఓదార్పు అందించాలని డిమాండ్ చేసారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి చేయాల పవన్ అన్నారు. దోషికి కఠిన శిక్ష పడే వరకూ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఈ వ్యవహారంలో నిందితుడుగా ఉన్న రాజును పట్టుకోవటం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు అధికారులను అప్రమత్తం చేసారు. ప్రభుత్వం సైతం ఈ ఘటన పైన సీరియస్ గా ఉంది. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో.. వెయ్యి కెమేరాలతో నిందితుడు కదలికలను పసిగట్టే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే, ఈ ఘటన జరిగిన తరువాత నిందితుడు ఉప్పల్ వరకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఉప్పల్ సిగ్నల్స్ దాటుతున్న విజువల్స్ సీసీ కెమేరాలో దొరికాయి. ఇప్పటికే నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయాల నజరానా ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. నిందితుడుకి మద్యం అలవాటు ఉండటంతో మద్యం దుకాణాల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసారు. ప్రతీ గల్లీలోనూ రాజు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఉప్పల్ నుంచి వెళ్లే ఆటోలు..బస్సుల డ్రైవర్ల నుంచి పోలీసులు సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడు పైన కఠిన చర్యలకు డిమాండ్ చేసారు.