జనసేనలో బిగ్ వికెట్ అవుట్
Telangana Lok Sabha election 2024: లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు.
ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. వంటి పలువురు సీనియర్లు కారు దిగారు.

భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వలస వెళ్లారు కొందరు సీనియర్ నాయకులు. సిద్ధిపేట్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తాజాగా కాంగ్రెస్లో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా- జనసేన సైతం తెలంగాణలో ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ జనసేన సీనియర్ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగ లక్ష్మణ్ గౌడ్.. తన పదవికి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్బై చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు.
వంగ లక్ష్మణ్ గౌడ్ సొంత నియోజకవర్గం నాగర్ కర్నూల్. జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఉన్నారు. 2023 నాటి ఎన్నికల్లో నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారాయన. ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
తెలంగాణలో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి గానీ, దాన్ని మరింత విస్తరించడానికి గానీ అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి ఆసక్తి చూపట్లేదనే నిర్ణయానికి రావడం వల్లే వంగ లక్మణ్ గౌడ్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications