బాబా గుడిలో అవినీతి, అమెరికా నుంచీ వసూళ్లు: నటి జయలలిత
హైదరాబాద్: నిజాంపేటలోని సాయిబాబా ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, కొందరు ఆలయ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని సినీ నటి, బాబా ట్రస్టు సభ్యురాలు జయలలిత ఆరోపించారు. నిజాంపేట షిర్డీసాయి ఆలయంలో గురువారం ఈ అంశంపై మాట్లాడారు.
సాయిబాబా ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు లెక్కలు చూపించడం లేదని, ట్రస్ట్ మేనేజింగ్ డెరైక్టర్గా చెప్పుకుంటున్న వ్యక్తి రూ. 25 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
బొట్ల లతాచౌదరి ఒక్కరే అంతా నడిపిస్తోందని, అమెరికాలోనూ బాబా గుడి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తమకు ఇష్టమైన వారినే ట్రస్టు సభ్యులుగా నియమించుకుని, భక్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని జయలలిత ఆరోపించారు.
ఆలయ పూజారి కూడా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భక్తులను ఆలయ ట్రస్టీలుగా నియమించాలని, ఇప్పటి వరకు ఆలయ లెక్కలను భహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ వేడుకలపై దాతలు, ట్రస్టీసభ్యులు, భక్తులకు సమాచారం ఇవ్వాలన్నారు.