వివాదం: తెలంగాణపై జయేంద్ర సరస్వతి భయం, వ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను వ్యతిరేకించారు. అంతేకాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పరమదించిన సందర్భంలో తెలంగాణవాళ్లు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన జయేంద్ర సరస్వతికి ఈ విషయాలు ఎందుకని ప్రశ్నించారు.

మరో కాశ్మీరులా మారుతుందని....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరో కాశ్మీరులా మారే ప్రమాదం ఉందని అప్పట్లో జయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. విభజన జరిగితే తెలంగాణలో అన్యమతస్థులు తిష్ట వేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దానివల్ల అల్లర్లు పెరుగుతాయని హెచ్చరించారు.

విద్యార్థులను సమిధలుగా...
విద్వేషాలు మానుకుని ప్రజలంతా కలిసి సహజీవనం చేయాలని జయేంద్ర సరస్వతి హితవు చెప్పారు. తెలంగాణ కోసం విద్యార్థులను సమిధలుగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. దాంతో తెరాస ఆయనపై మండిపడింది.

ఆయన సమైక్యతావాది...
జయేంద్ర సరస్వతి సమైక్యతావాది. సర్వధర్మాలు, మతాలు చెప్పేది ఒక్కటేనని ఆయన బోధనల సారాంశం. గురువు చంద్రశేఖర సరవ్వతితో కలిసి ఆయన మూడు సార్లు దేశమంతా పాదయాత్ర చేశారు. బంగ్లాదేశ్లో ఆధ్యాత్మిక బోధనలు చేసిన తొలి పీఠాధిపతి ఆయన.

సంఘ సేవ కూడా చేశారు...
సామాజిక సేవ పట్ల జయేంద్ర సరస్వతి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు పాఠశాలలు ఆస్పత్రులు ప్రారంభించారు. శంకర నేత్రాలయ, పిల్లల ఆస్పత్రి, హిందూ మిషన్ ఆస్పత్రి వంటివాటిని ప్రారంభించారు. ఒక రకంగా మానవ సేవ మాధవ సేవ అని భావంచారు. ఆయన హయంలో కంచి బలమైన పీఠంగా ఎదిగింది.












Click it and Unblock the Notifications