ప్రభుత్వంపై ఆవేదనతో అలా మాట్లాడా, అపార్థం చేసుకోకండి: జోగిని శ్యామల
Recommended Video
హైదరాబాద్: బోనాల జాతర సందర్భంగా మీడియాతో కేవలం తాను ఆవేదనతోనే మాట్లాడానని, ఉద్దేశ్యపూర్వకంగా కాదని జోగిని శ్యామల వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఆవేదన ఉందే తప్ప కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మాత్రం తాను విమర్శలు చేయలేదని ఆమె మంగళవారం విజ్ఞప్తి చేశారు.
కవిత తప్ప ఎవరూ కనిపించలేదా?: జోగిని శ్యామల కంటతడి, శాపనార్థాలపై ఆకుల విజయ
బోనాల జాతర సందర్భంగా జోగిని శ్యామల తీవ్రస్థాయిలో శాపనార్థాలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయం ఈవో అన్నపూర్ణ ఆహ్వానం మేరకు ఆమె మంగళవారం మహంకాళి ఆలయానికి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆళయ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మెయిన్ గేట్ వద్ద జరిగిన ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని తన మాటలను అపార్థం చేసుకోవద్దన్నారు. అనంతరం ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. బోనాల జాతర సందర్భంగా బోనం సమర్పించేందుకు జోగిని శ్యామల వచ్చినట్లు తమకు తెలియదని వెల్లడించారు.
బోనం సమర్పణకు వచ్చిన సందర్భంలో ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నట్లు తెలిసిన వెంటనే ఆమెతో తాను ఫోన్లో మాట్లాడానని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రావాలని కోరినట్లు తెలిపారు. దీంతో ఆమె వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని చెప్పారు.
కాగా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తనను అవమానించారని, ఏర్పాట్లలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని జోగిని శ్యామల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహిళలను అవమానిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బోనాల పండగను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు.. మహిళల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు.
మహిళలు ఒక్కొక్కరు దాదాపు 10-14కిలోల బరువు బోనంతో లైనులో నిల్చున్నారని, అయినా అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటలతరబడి భక్తుల క్యూలైన్లు ఆపేశారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కంటతడి పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కుప్పకూలుతుందని శాపనార్థాలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఆలయానికి పిలిపించిన ఈఓ... శ్యామలతో పూజలు చేయించి ప్రసాదాన్ని అందించారు.