గుడ్ పనిష్మెంట్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మొక్క నాటాల్సిందే..!
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న బూటకపు వార్తలను నమ్మొద్దంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందిన జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి వినూత్న పద్దతికి తెరతీశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు ఓ మొక్క నాటాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు హరితహారం ప్రచారంకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆమె భావించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంతో 24శాతం భూమిని పచ్చని చెట్లతో తీర్చి దిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
జోగులాంబా గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి 44వ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండటంతో అక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల ను నివారించేందుకు జోగులాంబ గద్వాల ట్రాఫిక్ పోలీసులు కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మైనర్లపై దృష్టి సారించారు. రెండురోజుల క్రితం ఘోరమైన రోడ్డు ప్రమాదం నేషనల్ హైవే 44పై జరిగిందన్న ఎస్పీ రాజేశ్వరి... ఇలాంటి ప్రమాదాలు నివారించడం కోసమే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకుండా.. సరైన పత్రాలు లేకుండా నడిపే వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు ఒక మొక్కను నాటిస్తున్నామని వివరించారు. ఆతర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి వారిని హరితహారం కార్యక్రమంలో భాగస్వామిని చేస్తున్నామని ఎస్పీ వివరించారు.
ఇదిలా ఉంటే... గద్వాల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, పోలీస్ క్వార్టర్స్, ట్రైనింగ్ ప్లేసెస్, జిల్లా పోలీస్ కార్యాలయాల్లో రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉంచుకున్నట్లు రాజేశ్వరి తెలిపారు. పౌరులను హరితహారం కార్యక్రమంలో భాగస్వామి చేయాల్సిందిగా ప్రతి పోలీసుకు టార్గెట్ ఇచ్చామని ఆమె చెప్పారు. ఇది ఒక్క ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించే వారికే పరిమితం కాకుండా మాజీ రౌడీ షీటర్లు, మాజీ నిందితులు కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశాలు జారీచేశామని చెప్పారు. హరిత హారం ప్రచారం కోసం జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ పోలీసు పేరుతో ఒక ఫేస్బుక్ పేజీని కూడా మొదలు పెట్టారు.