నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కాంగ్రెస్కు కవిత సవాల్
నిజామాబాద్: టీఆర్ఎస్ పార్టీపై వరుస విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండువేల కోట్ల రూపాయల నిధుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుంటారా? అని సవాల్ విసిరారు.
గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తనకు తెలియదని అన్నారు. ప్రజలు తమకు 100శాతం మార్కులు వేశారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమని ఆమె తెలిపారు.
ఎన్నికలంటే ప్రతిపక్షాలే భయపడుతున్నాయని కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా.. ప్రతిపక్షాలకే భయమేనని, వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్ అని అన్నారు. కొంగర కలాన్ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని అన్నారు.
Recommended Video
జోనల్ వ్యవస్థతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ ఆమోదించడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమని కవిత అన్నారు.