తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్: బయ్యారం-కడప స్టీల్ ప్లాంట్స్ సాధ్యంకావు, సుప్రీంలో అఫిడవిట్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నెరవేర్చిన హామీలు పోను, మిగిలిన విభజన హామీలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇందులో బయ్యారం ఉక్కు కర్మాగారం, కడప ఉక్కు కర్మాగారాలు కూడా ముఖ్యమైనవి. ఈ రెండు కర్మాగారాలు వస్తే స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావించారు.
'కడపపై రంగంలోకి చంద్రబాబు, ఇక జగన్కు నిద్రపట్టదు': అధినేత క్లాస్తో తగ్గిన నేతలు
సాధ్యం కావని సుప్రీం కోర్టులో అఫిడవిట్
కానీ ఈ ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. బయ్యారం ఉక్కు కర్మాగారం, కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కావని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఏముందో న్యాయస్థానానికి తెలిపింది. కర్మాగారాల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని పేర్కొంది.
తొలి ఆరు నెలల్లోనే చెప్పేశాం
తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని తేల్చి చెప్పినా, మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చాయని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్పష్టంగా నివేదిక వచ్చినట్టు పేర్కొంది. తమ ప్రభుత్వం ఏర్పాటయిన ఆరు నెలల్లోనే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు నష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పామని తెలిపారు.
కారణాలు ఇవీ
అలాగే ఖనిజాలు దొరకడం కూడా కష్టతరం అవుతోందని, ఇలాంటి సమయంలో ఇప్పటికిప్పుడు కొత్తగా ఏపీ, తెలంగాణలలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని తాము స్పష్టం చేశామని పేర్కొంది. అనేక మంత్రిత్వ శాఖలు, కేంద్రంలోని పలువురు మంత్రులు మరోసారి పరిశీలించాలని చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మెకాన్ సంస్థతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని తెలిపింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే బయ్యారం, కడపలోలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యంకాదని తేల్చి చెప్పింది.
నష్టమే కనుక సాధ్యం కాదు
ఇప్పుటికిప్పుడు చేయడం వల్ల నష్టమే వస్తుంది కనుక సాధ్యం కాదని చెప్పింది. ఇప్పటికే వీటిపై కోర్టులలో దాఖలైన పిటిషన్లకు తాము సమాధానాలు చెబుతున్నామని కేంద్రం పేర్కొంది. ఇప్పటికప్పుడు చేయడం వల్ల నష్టమే వస్తుంది గనక సాధ్యంకాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పటికే వీటిపై కోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు తాము సమాధానాలు చెబుతున్నామని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది.