విషాదం: పుట్టినరోజు నాడే కరోనాకు బలి.. చిన్న వయసులోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి...
కరోనా అంతు లేని విషాదాన్ని మిగులుస్తోంది. కుటుంబ సభ్యులను,ఆప్తులను,ప్రాణ స్నేహితులను బలి తీసుకుంటోంది. వయసు పైబడ్డ వారినే కాదు యువతను కూడా కబళిస్తోంది. ఇప్పుడిప్పుడే కెరీర్లో కుదురుకుంటున్నవారు,తల్లిదండ్రులకు అందివచ్చిన కొడుకులు,కుమార్తెలు కరోనా బారినపడి రాలిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.
సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన విజయ(26) అనే యువతి గురువారం(ఏప్రిల్ 22) కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె తాడ్వాయి మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బిడ్డ జీవితంలో ఇక స్థిరపడినట్లే.. పెళ్లి చేయడమే తరువాయి అని కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో... కరోనా ఇలా ఆమెను బలితీసుకున్నది. మరో విషాదం ఏంటంటే... పుట్టినరోజు నాడే ఆమె మృత్యు ఒడిలోకి చేరింది. దీంతో 'పుట్టినరోజు నాడే చనిపోయావా తల్లీ..' అంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
విజయ తండ్రి స్థానికంగా వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నారు. ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు ఎవరెన్ని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. కూతురిని కష్టపడి చదివించాడు. చదువు అయిపోయాక వెంటనే పెళ్లి చేయమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ ఆయన అలా చేయలేదు. కూతురు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతానంటే సరేనన్నాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా విజయ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సంపాదించింది.
ఓవైపు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగం కోసం ప్రిపేర్ అయింది. ఇదే క్రమంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం తాడ్వాయి మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. చిన్న వయసులోనే కూతురు మంచి ఉద్యోగం సాధించడంతో ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం వారికి ఎంతో కాలం నిలవలేదు.
కొద్దిరోజుల క్రితం విజయ కరోనా బారినపడింది. పరిస్థితి విషమించడంతో గురువారం(ఏప్రిల్ 23) మృతి చెందింది. విజయ కుటుంబ సభ్యుల రోధనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి. కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయి ఇలా కరోనాకు బలైపోవడం చాలామందిని ఆవేదనకు గురిచేస్తోంది. ఈ కరోనా ప్రళయంలో ఇలాంటి విషాదాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో...!!