'సంతానం కలిగిస్తామని మోసం చేశారు': పరస్పర ఫిర్యాదులు
కరీంనగర్: కరీంనగర్లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై దుమారం రేగుతోంది. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డాక్టర్ పద్మజ ఫలితం చూపకపోగా, ఇదేమిటని ప్రశ్నించినందుకు తుపాకీ ఉందని బెదిరించారని వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బలిజ శశికళ దంపతులు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి.
తమను సెక్యూరిటీ సిబ్బందితో ఆసుపత్రి నుంచి బయటకు గెంటి వేయించారంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను డాక్టర్ పద్మజ కొట్టిపారేశారు. శశికళ దంపతులకు మూడుసార్లు పరీక్షలు చేయాల్సి ఉండగా, ఒకేసారి పరీక్షలు చేయించుకుని వెళ్లారని తెలిపారు. మరోసారి వస్తే గర్భం వచ్చే అవకాశాలున్నాయని చెప్పినా వినకుండా డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై ఇటీవల తాము న్యాయస్థానం ద్వారా పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశామన్నారు.
శశికళ దంపతులను స్టేషన్కు పిలిపించి వారి నుంచి కరీంనగర్ టూ టౌన్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో ఆసుపత్రి నిర్వాహకుల నుంచి శశికళ దంపతులకు నిర్వహించిన పరీక్షల రిపోర్టులను తెప్పించుకుని నిజనిర్దారణ కోసం నిపుణుల కమిటీకి పంపించారు. కమిటీ వెల్లడించే నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు.
బలిజ శశికళ, శ్రీనివాస్ దంపతులు మీడియాతో మాట్లాడారు. "మాది వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామం. 13 ఏళ్లుగా సంతానం కలగడం లేదు. డాక్టర్ పద్మజ సంతాన సాఫల్యం ప్రకటనలు చూసి గత జూన్లో అక్కడికి వెళ్లాం. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం పొందడానికి దంపతులిద్దరికీ అవకాశాలున్నాయని చెప్పింది. అందుకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాకపోతే మూడుసార్లు ఉచితంగా చేస్తామని, తప్పకుండా గర్భం వస్తుందని హామీ ఇవ్వడంతో మూడున్నర లక్షలు చెల్లించాం" వారు చెప్పారు.
"వైద్యం చేస్తున్న క్రమంలో అదనంగా మరో లక్షన్నర విలువైన మందులు రాశారు. మొదటి సారి గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాలేదు. రెండవసారి చేయడానికి అండాలు చెడిపోయాయని, వాటికి మరో యాభైవేలు చెల్లించాలని తెలిపారు. పిల్లల కోసం ఉన్న ఆస్తితోపాటు పుస్తెల తాడు కూడా తాకట్టు పెట్టామని, ఇక డబ్బులివ్వలేమని చెప్పినా వినిపించుకోలేదు. సమయానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వలేదు. దీంతో నా పూర్తిగా ఆరోగ్యం పాడైంది" శశికళ చెప్పారు.
ఇదేమిటని అడిగితే డాక్టరమ్మ "నువ్వెక్కువగా మాట్లాడుతున్నవని తిట్టింది. మీలాంటి వారికోసమే తుపాకీ లెసైన్స్ తీసుకున్నాం.. మా ఆయన వద్ద ఆ తుపాకీ ఉంది" అంటూ బెదిరించిందని శిశికళ దంపతులు చెప్పారు. వారి ఆరోపణలను డాక్టర్ పద్మజ తోసిపుచ్చారు. వారే తమను బెదిరించారని ఆమె ఆరోపించారు.