హైదరాబాదులో సెటిలర్ల ఓట్ల తొలగింపు కుట్ర: ప్రసూన, చీప్ లిక్కర్పై కిషన్ రెడ్డి వ్యంగ్యం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూరితంగా సెటిలర్స్ ఓట్లు తొలగిస్తోందని మాజీ ఎమ్మెల్యే, సెటిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. హైదరాబాదులోని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సెటిలర్స్ ఓట్లను భారీగా తొలగించారని మండిపడ్డారు. బల్కంపేట పోలింగ్ కేంద్రం వద్ద ప్రసూన ఆందళన చేపట్టారు.
ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ పాలసీపై బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చీప్ లిక్కర్ ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ను నియమించేట్లు ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి గీత కార్మికుల పొట్ట కొట్టేందుకు కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. మంచినీళ్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి సమయం లేదు గానీ చీప్ లిక్కర్ అందించేందుకు మాత్రం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
విద్యావిధానంపై కేసీఆర్ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని కిషన్రెడ్డి ఆరోపించారు. కేజీ టు పీజీ పథకం అమలుపై సరైన కార్యాచరణ రూపొందించలేదని విమర్శించారు. మెడికల్ కాలేజీలపై ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలపై శత్రుత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని కిషన్రెడ్డి అన్నారు.