అక్కడ నుంచే గెలిచి..తండ్రికి తోడుగా : కవిత పక్కా వ్యూహంతో : బీజేపీకి కౌంటర్ గా..!!
జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రికి తోడుగా కేసీఆర్ కుమార్తె కవిత తిరిగి పార్లమెంట్ కి ఎన్నికయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాను ఎక్కడైతే ఓడానో..తిరిగి అక్కడి నుంచే పార్లమెంట్ లో కాలు పెట్టాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. దీంతో..నిజామాబాద్ రాజకీయాల్లో కొద్ద రోజులుగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ లక్ష్యంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పార్టీ పటిష్ఠతతో పాటుగా.. అభ్యర్ధులు ఎవరు అనే దాని పైన కొద్ది రోజులుగా టీఆర్ఎస్ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది.

కవిత వ్యూహాత్మక అడుగులు
అక్కడ ఇప్పుడు గులాబీ పార్టీ నేతలంతా కవితను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. రెండు జిల్లాల రాజకీయాల్లో కవిత కీలకంగా మారారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత పార్లమెంట్ పార్టీ తరపున కవిత క్రియాశీలకంగా వ్యవహరించారు. అనేక చర్చల్లో తన వాయిస్ వినిపించారు. ఇక, 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నిజామాబాద్ నుంచే ఎమ్మెల్సీ అయి..తాను అక్కడ నుంచే తన భవిష్యత్ రాజకీయం కొనసాగుతుందనే బలమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి ఈ రెండు జిల్లాల కేంద్రంగా పార్టీ నేతలు కవితకు మద్దతుగా నిలుస్తున్నారు. అదే సమయంలో తమ రాజకీయ భవిష్యత్ కోసం కవితను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నాడు ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల అమల్లో సక్సెస్ కాలేదు.

ఓడిన చోటే గెలిచి సత్తా చాటాలనే లక్ష్యంతో
అదే సమయంలో హిందుత్వ అజెండాతో పార్లమెంటరీ పరిధిలో ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి కౌంటర్ గా కవిత సైతం రాజకీయంగా కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ఈ వ్యూహంలో భాగంగానే ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ చుండూరు గ్రామంలో గోదావరి ఒడ్డున పునర్నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత ..ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న సర్వేల్లో దాదాపు 40 శాతం మంది అభ్యర్ధులకు టిక్కెట్ల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తోడుగా
దీంతో..కవిత ద్వారా తమ ఎమ్మెల్యే టిక్కెట్లను ఖరారు చేయించుకొనేందుకు ఈ రెండు జిల్లాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత చెబితే కేసీఆర్ కాదనరనే నమ్మకంతో వీరంతా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ముందుగా సంస్థాగతంగా ఎమ్మెల్యేల ఖరారు..గెలుపు ద్వారా తన బలం క్షేత్ర స్థాయి నుంచి పెంచుకొనేందుకు కవిత సైతం ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించటం.. తిరిగి ఎంపీగా పార్లమెంట్ కు వెళ్లి..తన తండ్రికి జాతీయ రాజకీయాల్లో తోడుగా నిలవటం ఇప్పుడు కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు నిజామాబాద్ లో కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాూ.. ప్రణాళికా బద్దంగా ముందడుగు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications