మూడోరోజు ఈడీ ఎదుట హాజరైన కవిత: తన ఫోన్లు ప్రదర్శించి మరీ విచారణకు ఎమ్మెల్సీ!!
మూడోరోజు ఈడీ ఎదుట హాజరైన కవిత తన ఫోన్లు ప్రదర్శించి మరీ విచారణకు వెళ్ళారు. దీంతో ఈడీ కవిత వాడిన మొబైల్స్ అడిగినట్టు తెలుస్తుంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరో మారు మూడవసారి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈరోజు 11 గంటల 30 నిమిషాలకు ఈడి ఆఫీస్ కు చేరుకున్న కవిత, ఈడి ఆఫీస్ కి వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ ఇంటి నుండి బయలుదేరుతూ మీడియాకు తన ఫోన్లను ప్రదర్శించారు.
ఎమ్మెల్సీ కవిత ఉపయోగించిన మొబైల్ ఫోన్లను ఈరోజు ఈడి అధికారులు తీసుకురావాలని చెప్పడంతో కవిత ఉపయోగించిన అన్ని మొబైల్స్ కవర్లలో ప్యాక్ చేసి ఈడి అధికారుల వద్దకు తీసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె ఆ మొబైల్ ఫోన్లనన్నింటిని మీడియాకు ప్రదర్శించడం ద్వారా, తాను ఈ కేసులో నిర్దోషినని, ఈడి ఎటువంటి విచారణ చేసినా, ఏ వివరాలు అడిగినా తాను ధైర్యంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాదు కవిత తాను ఎటువంటి ఫోన్లను నాశనం చేయలేదని చెప్పడం కోసమే ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఫోన్లను ప్రదర్శించారు.

ఎమ్మెల్సీ కవిత దాదాపు తొమ్మిది ఫోన్ లను మార్చారని ఆ ఫోన్లను అన్నింటినీ తీసుకురావాలని ఈడి అధికారులు కోరడంతో కవిత ఈ మొబైల్ ఫోన్లన్నింటినీ తీసుకువెళ్లారు. ఇక నేడు కూడా ఈడీ ఆఫీస్ కి వెళ్లే ముందు కవిత మరోమారు తన న్యాయవాదులను సంప్రదించారు. ఆ తర్వాత ఈడి ఆఫీస్ కి వెళ్ళిన కవిత ఈడీ కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కవిత రెండు సిమ్ కార్డులతో 10 ఫోన్లను ఉపయోగించారని ఈ కేసులో 36 మంది 170 ఫోన్లను వాడినట్టు ఈడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కవిత వాడిన మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. తనను రాజకీయ కోణంలో విచారణ చేస్తున్నారని కవిత ఆరోపించారు. కావాలని ఈడీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని కవిత నిప్పులు చెరిగారు. గతంలో తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లు అన్నింటిని ఈడి అధికారులకు అందజేస్తానని కవిత పేర్కొన్నారు. నేడు కూడా ఈడీ కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో నేడు ఈడి విచారణ ఏ విధంగా సాగబోతుంది. ఎమ్మెల్సీ కవితను ఈడి ఏ అంశాల పైన ప్రధానంగా ప్రశ్నించనుంది. కవిత విషయంలో ఏం జరగబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను ఉత్కంఠ గా మారింది.












Click it and Unblock the Notifications