కవిత తో కలిసొచ్చే బీఆర్ఎస్ నేతలెవరు, తెర వెనుక- మారుతున్న లెక్కలు..!!
కవిత కొత్త పార్టీ ప్రకటించారు. టీఆర్ఎస్ పేరుతోనే పార్టీని ప్రారంభించారు. తండ్రి కేసీఆర్ ను టార్గెట్ చేసారు. తన పార్టీ లక్ష్యాలను ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి కొత్త పార్టీగా ప్రజల ముందుకు వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కొత్త పార్టీ ఆర్భాటం గా ప్రకటించిన కవిత.. భవిష్యత్ లక్ష్యాలు సవాల్ గా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ నే టార్గెట్ గా చేస్తున్న క్రమంలో కవితతో కలిసొచ్చేదెవరు. కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్న కవిత.. కాంగ్రెస్ పైన ఆ స్థాయిలో ఎందుకు విమర్శలు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తన తండ్రి నీడలో ఉద్యమంలో.. రాజకీయంగానూ ఎదిగిన కవిత ఇప్పుడు కేసీఆర్ లక్ష్యంగా కొత్త పార్టీ ప్రారంభించారు. తన పార్టీ ఆవిష్కరణ సభలో బీఆర్ఎస్ ను కవిత పూర్తిగా టార్గెట్ చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమ రథం దారితప్పిందని, సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని ఆమె ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. "కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు.. ఆయనో మరమనిషి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన బయటకు రారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది" అని కవిత అన్నారు. ప్రజలకు ఏ చిన్ని కష్టం వచ్చినా ఆనాటి కేసీఆర్ బయటకు వచ్చేవారని... ఈనాటి కేసీఆర్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. పార్టీ ప్రకటన చేసిన కవితతో అసలు ఇప్పుడు కలిసి నడిచేది ఎవరు.. బీఆర్ఎస్ నుంచి వచ్చేది ఎవరు అనేది కీలక అంశంగా మారుతోంది.

కవితకు అదే అసలు ఛాలెంజ్
ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు నేరుగా కేసీఆర్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. కేసీఆర్ లో మార్పు వస్తుందేమోనని తాను చాలా కాలంగా ఎదురు చూశానని... ఆయనలో మార్పు రాకపోగా, తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మను కాపాడేందుకే తాను కొత్త పార్టీ పెట్టానని చెప్పారు. మూడు ప్రధాన పార్టీల రాజకీయంలో కవిత ఏ మేర రాణిస్తారనేది ఇప్పుడు కొత్త చర్చగా మారుతోంది. కవిత పార్టీ ద్వారా బీఆర్ఎస్ కు నష్టమనే వాదన ఉంది. అయితే, కవిత పార్టీ పైన బీజేపీ, బీఆర్ఎస్ స్పందించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీల స్థాయిలో వాయిస్ వినిపించ లేదు. కవితకు బీఆర్ఎస్.. కేసీఆర్ సన్నిహితులు ఎవరైనా కలిసి వస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది. రాజకీయంగా జాతీయ పార్టీలకే షాక్ లు ఇచ్చిన కేసీఆర్ చాణక్యం గురించి తెలిసిన కవిత.. ఇప్పుడు నేరుగా తన తండ్రినే ఢీ కొట్టాలనే వ్యూహం ఫలిస్తుందా అనేది కీలక అంశంగా మారుతోంది. స్థానిక సంస్థల్లో పోటీకి దిగుతానని కవిత చెప్పటం ద్వారా.. గ్రేటర్ లో గులాబీ పార్టీకి కొంత నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి కవిత తన పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.













Click it and Unblock the Notifications