కెసిఆర్ కూడా రైతే, సమస్యలు తెలుసు: రైతు ఆత్మహత్యలపై కవిత విచారం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతేనని, ఆయన వ్యవసాయంలో ఉన్న కష్టాలు తెలుసని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని రవీంద్రభారతీలో జరిగిన వినియోగదారుల జాతీయ సదస్సులో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విత్తన కంపెనీలు పంటకు, విత్తనాలకు బీమా కల్పించే విధంగా చూడాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. సేద్యం భారమై దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు..
ఈ క్రమంలో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ర్టాల్లో కూడా అన్నదాతలు తనువులు చాలిస్తున్నారని చెప్పారు. ఇది ఎంతో విషాదకరమని చెప్పారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు. ఆధునిక పద్ధతుల్లో సేద్యాన్ని చేస్తున్నారు. అన్నదాతల సమస్యలు సీఎంకు తెలుసు' అని అన్నారు.

‘రైతు సమస్యల పరిష్కారానికి లోతైన అధ్యయనం చేస్తున్నాం. విత్తన కంపెనీలు విత్తనాలకు, పంటకు బీమా బాధ్యత వహించాలి. గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా వినియోగదారుడు మనపై ఆధారపడిలేడు. మనమే అతనిపై ఆధారపడి ఉన్నాం. అందువల్ల వినియోగదారుడే మనకు దేవుడన్నారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలి' కవిత పేర్కొన్నారు.
కేంద్రం ఆదుకోవాలి: పోచారం శ్రీనివాస్రెడ్డి
దేశావ్యాప్త రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు. మనందరికి తిండిపెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మధ్యవర్తుల వల్లే అటు రైతు, ఇటు వినియోగదారుడు లాభపడడం లేదని చెప్పారు.
1950 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ‘పంటలన్నింటికి బీమా సౌకర్యం కల్పించాలి. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తే ఆత్మహత్యలుండవు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి. కేంద్రం ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలి' పోచారం శ్రీనివాస్ కోరారు.












Click it and Unblock the Notifications