ఫోన్ ట్యాపింగ్ గరం, వేములవాడకు వెళ్తే పదవి హుష్కాకీ!: ధైర్యం చేసిన కేసీఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెంటిమెంటు కాదని ధైర్యం చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
ఏపీ మంత్రులు ఓ అడుగు ముందుకేసి, తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ వేములవాడకు వెళ్లడం 'సెంటిమెంట్' గురించి మాట్లాడుకునే వాళ్లకు చర్చనీయాంశమైందనే చెప్పవచ్చు.
గురువారం కేసీఆర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే, ఓ పుకారు ఉండటం గమనార్హం. ఈ ఆలయాన్ని దర్శించిన వారు పదవి కోల్పోతారనే ప్రచారం ఉంది.
టీ అంజయ్య, కే విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావులు ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత పదవులు కోల్పోయారు. అయితే, కేసీఆర్ మాత్రం ఈ ఆలయంలో ఏడు గంటలు గడిపారు.
మరో విషయమేమంటే, అలాంటి ఊహాగానాలు ఉన్నప్పటికీ.. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నర్సింహా రావు పైన కూడా ప్రభావం పడలేదని చెబుతున్నారు. కాగా, త్రిదండి చినజీయర్ స్వామి సూచన మేరకు కేసీఆర్ ఈ ఆలయాన్ని సందర్శించారని తెలుస్తోంది. కేసీఆర్ చినజీయర్ స్వామి సూచనలు పాటిస్తారు.