సిఎంలిద్దరికీ నేను ఓకే, కారణాలు వెతకొద్దు: గవర్నర్, బాబు-కెసిఆర్ డుమ్మా
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఎట్ హోంకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు శనివారం నాడు గైర్హాజరయ్యారు. ఇరువురు సిఎంలు హాజరవుతారా? ఏం మాట్లాడుకుంటారు? అనే ఆసక్తికర చర్చ జరిగింది.
కానీ, ఇరువురు సిఎంలు కూడా గైర్హాజరయ్యారు. విందులో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ మంత్రులన నాయిని నర్సింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఏపీ మాజీ సిఎం నాదెండ్ల భాస్కర రావు తదితరులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పలకరించారు.
తేనీటి విందు సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల గైర్హాజరుపై ప్రశ్నించగా.. సీఎంలు రాకపోవడానికి ప్రత్యేక కారణాలు వెతకొద్దన్నారు. చంద్రబాబు పట్టిసీమ కార్యక్రమంలో ఉన్నారని, కెసిఆర్ కృష్ణా జలాలలపై సమీక్షలో ఉన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రులు రాకపోయినా.. నేను ఉన్నాను, మీరు వచ్చారు కదా అని సిఎంలు వస్తే మా మనవడు, మనుమరాలు ఫోటోలు దిగాలనుకున్నారని, వారు కొంత నిరుత్సాహపడ్డారని చమత్కరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు తాను కావాల్సిన వాడినేనని చెప్పారు.
హైదరాబాదులో ఉన్నంత వరకు అందరూ తనను ఆమోదిస్తారని చెప్పారు. తాను ఆశావాదినని, ఇరు రాష్ట్రాల్లో పరిస్థితులు కాలానుగుణంగా చక్కదిద్దుకుంటాయని చెప్పారు.
విందుకు హాజరైన సిపిఐ నేత నారాణ వద్దకు వెళ్లి.. నన్ను మీరు విమర్శించారు కదా.. అని చమత్కరించారు. తాను వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, పదవి గురించి మాత్రమే మాట్లాడానని నారాయణ చెప్పారు. దీంతో, అక్కడ నవ్వులు విరిశాయి.